
రాజన్న గోశాలలో కోడెలు
వేములవాడ రాజన్న గోశాలల్లో కోడెల మృత్యుఘోష
సామర్థ్యానికి 3 రెట్ల మేర గోశాలల్లో కుక్కుతుండటంతో తొక్కిసలాటలు, అంటురోగాలు
భారీగా చనిపోతున్న మూగజీవాలు.. పూడ్చి చేతులు దులుపుకుంటున్న సిబ్బంది
చోద్యం చూస్తున్న దేవాదాయశాఖ మంత్రి కార్యాలయం
పకడ్బందీ వితరణ విధానం లేక అభాసుపాలవుతున్న దేవాదాయశాఖ
సాక్షి, హైదరాబాద్: భక్తులు దేవుడికి సమర్పించిన కోడెలను సంరక్షించాల్సిన దేవాదాయ శాఖ వాటికి మరణశాసనం లిఖిస్తోంది. కొందరు అధికారుల నిర్లక్ష్యం, చేతివాటం ఫలితంగా కొన్ని రోజులుగా రోజుకు 8 నుంచి 10 కోడెలు ప్రాణాలు వదులుతున్నాయి. దీనిపై ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్థానిక యంత్రాంగం చేతులెత్తేసింది. చనిపోయిన కోడెలను ఖననం చేయటం తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేకపోతోంది.
భక్తుల ఆనవాయితీని సొమ్ము చేసుకుంటూ..
మరే దేవాలయంలో లేని ఓ ఆనవాయితీ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో ఉంది. కోరికలు నెరవేరిన భక్తులు దేవుడి మొక్కు కింద కోడె (ఎద్దు)లను ఆలయానికి సమర్పించడం ఏళ్లుగా కొనసాగుతోంది. ఇలా పొందిన కోడెల సంరక్షణకు ఆలయం రెండు గోశాలలను నిర్వహిస్తోంది. గతంలో కోడెలను వేలం ద్వారా తిరిగి అమ్మే పద్ధతి ఉండేది. భక్తులు సమర్పించిన వాటిని విక్రయించడం, కొందరు కొని వాటిని కబేళాలకు తరలిస్తుండటం తీవ్ర విమర్శలకు కారణమైంది. దీంతో వేలం ప్రక్రియను నిలిపేసి వాటిని సంరక్షించే గోశాలలకు, వ్యవసాయ పనులు చేసుకొనే రైతులకు ఉచితంగా ఇచ్చే పద్ధతి ప్రారంభమైంది.
కానీ దీని అమలుకు పక్కా విధానం లేకుండా పోయింది. గోశాలలు, రైతుల పేరు చెప్పి కొందరు వాటిని చేజిక్కించుకొని అమ్ముకుంటున్నారు. ఈ విషయంలో దేవాదాయ శాఖ ఉద్యోగులు కూడా కమీషన్లకు అలవాటుపడి వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణ ఉంది. అలా వెళ్లే కోడెల పరిస్థితి ఏమిటో పరిశీలించే విధానం లేదు. కబేళాలకు అమ్మేందుకు కోడెలను తీసుకెళ్తున్న వారి వివరాలు తెలిసి కూడా దేవాదాయశాఖలోని కొందరు సిబ్బంది కాసుల కోసం వాటిని అప్పగించేస్తున్నారు.
అక్రమాలకు బ్రేక్ పడినా..
గతేడాది ఆగస్టులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తమకు గోశాల ఉందని.. వేములవాడ ఆలయ గోశాల నుంచి గోవులు ఇస్తే పోషించుకుంటామంటూ దేవాదాయశాఖ మంత్రి కార్యాలయానికి అర్జీ పెట్టుకున్నాడు. దాన్ని పరిశీలించాలంటూ మంత్రి కార్యాలయం ఆ అర్జీని వేములవాడ దేవాలయ అధికారులకు పంపింది. ఆ వ్యక్తి ఏకంగా 60 కోడెలు, గోవులు అడగ్గా అధికారులు అభ్యంతరం చెప్పారు.
కానీ మంత్రి కార్యాలయం ఆదేశించడంతో ఇవ్వక తప్పలేదు. అలా పొందిన మూగజీవాల్లో చాలా వాటిని ఆ వ్యక్తి అమ్మేసుకున్నాడని ఆ తర్వాత అధికారులకు ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసు కేసు నమోదవగా, విచారణలో అది నిజమేనని తేలింది. అప్పట్లో ఇది సంచలనం కావడంతో కోడెల వితరణను జిల్లా కలెక్టర్ నిలిపివేయించారు. పంపిణీకి కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఉండటంతో ఆయన చర్యలు తీసుకున్నారు.
అనారోగ్యం.. ఆపై తొక్కిసలాటలు..
కోడెల వితరణ నిలిచిపోవడం, మొక్కుల రూపంలో కోడెలు వస్తుండటంతో ఆలయ గోశాలలు కోడెలతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం గోశాలల్లో 1,250కిపైగా కోడెలు ఉన్నట్లు సమాచారం. ఉండాల్సిన వాటికంటే మూడు రెట్లు ఎక్కువ గా ఉండటంతో గోశాలల్లో వాటికి తిరిగే చోటు కూడా లేదు. పైగా కనీస వసతులు కూడా లేకపోవడం, వర్షాలు కురుస్తుండటంతో గోశాలలు రొచ్చురొచ్చుగా మారిపోయాయి.
రోజుల తరబడి బురద ఉండటంతో గిట్టల దగ్గర నుంచి ఇన్ ఫెక్షన్ సోకి చాలా కోడెలు అనారోగ్యానికి గురవుతున్నాయి. మరోవైపు తొక్కిసలాట కూడా జరుగుతోంది. ఫలితంగా నిత్యం కోడెలు చిపోతున్నాయి. వాటిని ట్రాక్టర్లలో తీసుకెళ్లి గోతులు తవ్వి గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేసి సిబ్బంది చేతులు దులుపుకొంటున్నారు. ఇంత జరుగుతున్నా దేవాదాయశాఖ మంత్రి కార్యాలయం కిమ్మనడం లేదు. విషయాన్ని ఆలయ అధికారులు కమిషనర్ కార్యాలయానికి చేరవేశారు. కానీ మంత్రి కార్యాలయమే నిర్లక్ష్యంగా ఉండటంతో కమిషనరేట్ కూడా మౌనందాల్చింది.
ఒక్కరోజే 8 కోడెలు మృత్యువాత
వేములవాడ అర్బన్: వేములవాడ రాజన్నకు చెందిన 8 కోడెలు శుక్రవారం మృత్యువాత పడ్డాయి. అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మూలవాగులో వాటిని ఖననం చేశారు. శ్రీ రాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను తిప్పాపూర్లోని గోశాలలో సంరక్షిస్తున్నారు. ఈ గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉండటంతో తొక్కిసలాట జరిగి చనిపోతున్నాయని ఆరోపణలున్నాయి.
ఏటా కోడె మొక్కులతో రాజన్న ఆలయానికి దాదాపు రూ. 22 కోట్లకుపైగా ఆదాయం వస్తున్నా వాటి సంరక్షణపై ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వసతులు సరిగ్గా లేక చిన్నపాటి వర్షానికే గోశాల బురదగా మారి కోడెలు అనారోగ్యం పాలవుతున్నట్లు సమాచారం. ఇప్పటిౖకైనా ఆలయ అధికారులు కోడెల సంరక్షణపై నిర్లక్ష్యం చేయకుండా వసతులు కల్పించాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.