
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి హరీశ్రావు
కాళేశ్వరం కమిషన్కు స్పష్టం చేసిన మాజీమంత్రి హరీశ్రావు
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడం వల్లే బరాజ్ లొకేషన్ మేడిగడ్డకు మార్పు
బరాజ్ల నిల్వ సామర్థ్యం పెంచుకోవాలని సూచించడంతోనే ప్రాజెక్టు రీఇంజనీరింగ్
రుణాల సమీకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్
గంటసేపు కొనసాగిన జస్టిస్ ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతి నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరిగిందని నీటిపారు దల శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్రావు చెప్పారు. మంత్రివర్గ ఆమోదంతోనే డీపీఆర్ తయారీ పనులను వ్యాప్కోస్కు అందించినట్టు తెలిపారు. బరాజ్ల నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం తన కార్యాలయంలో హరీశ్రావుకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక ప్రశ్నలు సంధించింది.
సాగునీటి ప్రాజెక్టులపై అధ్యయనం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం పరిధి ఏమిటి? అని కమిషన్ ప్రశ్నించగా, హరీశ్రావు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి అంతర్రాష్ట్ర వివాదాలు ఉండటం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతులు, నీటి కేటాయింపులు లేకపోవడంతో.. వాటి నిర్మాణాన్ని పునఃసమీక్షించి రీఇంజనీరింగ్పై సిఫారసులు చేసేందుకు గత ప్రభుత్వం తన నేతృత్వంలో నాటి మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావుతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. మంత్రివర్గ ఉప సంఘం సిఫారసుల ఆధారంగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించడం జరిగిందని, ఒక భాగాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పరిమితం చేయగా, రెండో భాగాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా నిర్మించడం జరిగిందని తెలిపారు.
అందుకే మేడిగడ్డకు బరాజ్..
మహారాష్ట్ర అభ్యంతరాలు, తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ పేర్కొనడంతో బరాజ్ లొకేషన్ను మేడిగడ్డ వద్దకు మార్చినట్టు హరీశ్రావు చెప్పారు. ‘2014 జూలై 23న నేను మహారాష్ట్ర వెళ్లి అక్కడి నీటిపారుదల శాఖ మంత్రి హసన్ ముష్రీఫ్ను కలవగా, తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని తేల్చి చెప్పారు. అక్కడ బరాజ్ నిర్మాణానికి అంగీకరించమబోని, పనులు చేపట్టి నిధులు వృధా చేసుకోవద్దని కోరుతూ నాటి మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చవాన్ అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్కుమార్ రెడ్డికి రాసిన లేఖ ప్రతిని ముష్రీఫ్ నాకు అందజేశారు.
బరాజ్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు ధర్నాలు చేస్తుండడంతో అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. తర్వాత మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2015 ఫిబ్రవరి 17న మహారాష్ట్ర రాజ్భవన్లో ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమై చర్చలు జరిపారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి వ్యతిరేకంగా తాను స్వయంగా ఆందోళనలు చేసిన నేపథ్యంలో అనుమతించడం సాధ్యం కాదని ఫడ్నవీస్ తేల్చి చెప్పారు..’ అని హరీశ్రావు వివరించారు.
అలాగైతే 48 టీఎంసీల లభ్యతే..
‘మహారాష్ట్ర అనుమతించిన మేరకు తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే 48 టీఎంసీల లభ్యతే ఉంటుంది. 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 160 టీఎంసీలను తరలించుకోగలం. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత మాత్రమే ఉండగా, అందులో 63 టీఎంసీలపై ఎగువ రాష్ట్రాలకు హక్కులున్నట్టు తేల్చుతూ 2015 ఫిబ్రవరి 18న సీడబ్ల్యూసీ లేఖ రాసింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు 160 టీఎంసీల నీళ్లు అవసరం. ఆ మేరకు నీళ్లను నిల్వ చేసుకోవడానికి బరాజ్ల నిల్వ సామర్థ్యం పెంచుకోవాలని 2008 ఆగస్టు 12న సీడబ్ల్యూసీ ఇంకో లేఖ రాసింది. అందుకే ప్రాజెక్టు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది.
మేడిగడ్డ వద్ద 282.3 టీఎంసీల నీటి లభ్యత ఉందని 2017 నవంబర్ 12న సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. అక్కడ బరాజ్ నిర్మించాలని 2016 జనవరి 17న వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది..’ అని మాజీమంత్రి చెప్పారు. అన్నారం, సుందిళ్ల బరాజ్ల లొకేషన్ మార్చాలని హైపవర్ కమిటీ సిఫారసు చేసిందా? అని కమిషన్ అడగగా.. ఇలాంటి సాంకేతిక అంశాలపై నీటిపారుదల శాఖ నిర్ణయాలు తీసుకుందని బదులిచ్చారు. ఇంజనీర్ల సూచనలను గౌరవించారా? అని కమిషన్ ప్రశ్నించగా, అవునని హరీశ్ చెప్పారు. సైట్ పరిస్థితుల ఆధారంగా ప్రాజెక్టుల లొకేషన్లు మారడం సహజమేనని, నాగార్జునసాగర్, శ్రీరామ్సాగర్ వంటి ప్రాజెక్టుల విషయంలో సైతం అలానే జరిగిందని అన్నారు.
కేఐపీసీఎల్ ఏర్పాటుపై కేబినెట్లో నిర్ణయం
‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిధుల కొరత ఉండడంతోనే రుణాల సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్(కేఐపీసీఎల్)ను ఏర్పాటు చేశాం. కేఐపీసీఎల్ ఏర్పాటుపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నా, దాని రుణాలు, వడ్డీలను ఎలా తిరిగి చెల్లించాలనే అంశంపై మాత్రం ఎలాంటి చర్చ జరగలేదు..’ అని హరీశ్ తెలిపారు. రుణాలకు ప్రభుత్వం పూర్తి గ్యారెంటీ ఇచ్చి వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించిందని వివరించారు.
నీటి నిల్వ ఇంజినీర్లకు సంబంధించిన బాధ్యత
ఎవరి ఆదేశాలతో బరాజ్లలో నీళ్లను నిరంతరంగా నిల్వ చేశారని కమిషన్ ప్రశ్నించగా.. ఇది ఇంజనీర్లకు సంబంధించిన బాధ్యత అని హరీశ్ చెప్పారు. ఈ విషయంలో తామెలాంటి సూచనలు చేయలేదన్నారు. నీటి నిల్వ కోసమే బరాజ్లు నిర్మించారా? అని కమిషన్ అడగగా, ఇది పూర్తిగా సాంకేతిక పరమైన అంశమని జవాబిచ్చారు. బరాజ్లలో ఏ పరిమాణంలో నీళ్లను నిల్వ చేయాలి అని కమిషన్ ప్రశ్నించగా, మొత్తం 141 టీఎంసీలను నిల్వ చేసేందుకు వాటిని నిర్మించామని చెప్పారు.
కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాక కొత్తగా ఫ్లడ్ బ్యాంకులు, డిశ్చార్జి ఛానల్స్ నిర్మాణం పనులు అప్పగించడం ప్రణాళిక లోపం కాదా? అని కమిషన్ అడగగా, సాంకేతిక అంశాలపై సమాధానమివ్వలేనని హరీశ్ బదులిచ్చారు. టెండర్లు పూర్తై కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాక నిబంధనలు మార్చవచ్చా? అని ప్రశ్నించగా, క్షేత్ర స్థాయి పరిస్థితుల ఆధారంగా నీటిపారుదల శాఖ సిఫారసులు చేస్తే మార్చవచ్చని వివరణ ఇచ్చారు. నిపుణుల కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారని కమిషన్ అడగగా, మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నీటి తరలింపుపై సిఫారసులు చేసేందుకని బదులిచ్చారు. ఎన్టీపీపీసీ పవర్ ప్లాంట్తో పాటు బొగ్గు గనులుండడంతో నేరుగా నీటి తరలింపు సాధ్యం కాదని నిపుణుల కమిటీ తేల్చిందన్నారు.
హిందీలో చెప్పండి పరవాలేదు..
దాదాపు గంట పాటు హరీశ్రావు క్రాస్ ఎగ్జామినేషన్ను కమిషన్ నిర్వహించింది. తెలుగు మాధ్యమంలో చదివిన తనకు ఆంగ్లంపై పట్టులేదని ప్రారంభంలోనే హరీశ్రావు తెలపగా, హిందీలో సమాధానమిస్తే ఆంగ్లంలో తర్జుమా చేసుకుంటామని జస్టిస్ ఘోష్ చెప్పారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలకు సైతం కోర్టు హాల్లోకి కమిషన్ అనుమతినిచ్చింది.
న్యాయవాదులకు అనుమతి లేదని కమిషన్ సిబ్బంది తెలియజేయగా, లిఖిత పూర్వక ఆదేశాలు తీసుకొస్తేనే బయటకు వెళ్తామని బీఆర్ఎస్ లీగల్ సెల్ నేత సోమ భరత్కుమార్ వాగ్వాదానికి దిగారు. దీంతో సాధారణ వ్యక్తులుగా కూర్చోవడానికి వారికి కమిషన్ అనుమతినిచ్చింది. క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం బీఆర్కేఆర్ భవన్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడిన హరీశ్రావు వివరాలను వెల్లడించారు.