సాక్షి, హైదరాబాద్: కొత్వాల్గూడ్లో హైడ్రా హడావిడి చేస్తోంది. స్థానికంగా ఓ క్రషర్స్ మిషన్స్ను కూల్చివేస్తోంది. ఇది ఓ మంత్రికి సంబంధించిందంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండడం గమనార్హం.
వట్టినాగులపల్లిలో అనుమతి లేని క్రషర్లను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. మొత్తం ఐదు ప్రాంతాల్లో అక్రమ క్రషింగ్ యూనిట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలో ఉన్న ఈ క్రషర్ల చుట్టూ ఉన్న వివాదాలు నెలకొన్నాయి. జీవో నెంబర్ 111 నిబంధనలను అతిక్రమిస్తూ.. అక్రమంగా ఓ మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్స్ కంపెనీ క్రషర్లను నడుపుతోందని ఆరోపణలు వచ్చాయి. హిమాయత్సాగర్ క్యాచ్మెంట్ ఏరియా (111 జీవో పరిధి)లో ఈ క్రషర్లు పనిచేస్తున్నాయని, గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని స్థానికులు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే..
తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. 15 స్టోన్ క్రషర్లకు (పరిధిలోని వివిధ ప్రాంతాలు) జరిమానాలు కూడా విధించినట్లు సమాచారం. అయితే సదరు మంత్రికి చెందిన కంపెనీ ఆ లిస్ట్లో లేదని స్థానిక అధికారులు తెలియజేశారు. ఆ వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో తాజా కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


