వేలూరు: డీఎంకే అధిష్టానం తీసుకునే నిర్ణయానికి పార్టీ కార్యకర్తలు కట్టుబడి ఉండాలని ఆ పార్టీ వేలూరు జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే నందకుమార్ అన్నారు. వేలూరులోని డీఎంకే పార్టీ కార్యాలయంలో జిల్లాలోని డీఎంకే పార్టీ కార్యకర్తలు, కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నందకుమార్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడానికి కార్యకర్తలు నిరుత్సాహం చెందరాదన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లోను డీఎంకే పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ, ఇందుకు సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు నిరుత్సాహం చెందకుండా ఉండాలన్నారు. స్థానిక ఎన్నికల్లో ద్రావిడ మాడల్ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. జూన్ 3వ తేదీన కలైంజర్ కరుణానిధి 103 జయంతి వేడుకలను వేలూరు తూర్పు డివిజన్ పరిధిలో వైభవంగా నిర్వహించడంతో పాటూ నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను అమలు చేశారు. సమావేశంలో వేలూరు కార్పొరేషన్ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కార్తికేయన్, జెడ్పీ చైర్మన్ బాబు, మాజీ ఎంపీ మహ్మద్ సఖీ, మేయర్ సుజాత, యూనియన్ కార్యదర్శులు గజేంద్రన్, సుందరపాండియన్, గణేష్ శంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.


