న్యూస్రీల్
సాక్షి, చైన్నె : ముఖ్యమంత్రిగా విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే సంతకం చేసిన మొదటి కీలక హామీ.. ‘‘500 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే అన్ని గృహ విద్యుత్ కనెక్షన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం’’ అన్న విషయం తెలిసిందే. ఈ పథకం ఈనెల 10 విజయవంతంగా అమలులోకి వచ్చిన తీరును, దాని ప్రస్తుత స్థితిగతులను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.
లో–వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
వేగంగా విస్తరిస్తున్న నగరాల అవసరాలు, పారిశ్రామిక వృద్ధి, , వ్యవసాయ ఉత్పత్తిని పెంచేందుకు రైతులకు అంతరాయం లేని విద్యుత్ను అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్థిక, సాంకేతిక సవాళ్లు ఉన్నప్పటికీ విద్యుత్ బోర్డు మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న లో–వోల్టేజ్ సమస్యలు, రోజువారీ వినియోగదారుల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
గరిష్ట విద్యుత్ సరఫరా
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 21,326 మెగావాట్లను ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా విజయవంతంగా సరఫరా చేసినట్లు విద్యుత్ బోర్డు అధికారులు సీఎంకు వివరించారు. కొత్త సబ్–స్టేషన్ల ఏర్పాటు, పాత విద్యుత్ లైన్ల ఆధునీకరణతో పాటు, దక్షిణ జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే సౌర , పవన విద్యుత్ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ’గ్రీన్ ఎనర్జీ కారిడార్’ పనులను వేగవంతం చేయడంపై చర్చించారు.ప్రస్తుత వేసవి కాలం , రాబోయే వర్షాకాలాన్ని దృషిలో ఉంచుకుని.. అవసరమైన విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లను తగినంత పరిమాణంలో ముందస్తుగానే స్టాక్ ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో విద్యుత్, న్యాయశాఖ మంత్రి ఆర్. నిర్మల్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం. సాయికుమార్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అమ్మ క్యాంటీన్ల ఆధునీకరణకు ఆదేశం
తమిళనాడులో పేద ప్రజల ఆకలి తీరుస్తున్న అమ్మ క్యాంటీన్ల పునరుద్ధరణ, ఆధునీకరణకు సీఎం విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ పరిధిలో 383, ఇతర మునిసిపల్ కార్పొరేషన్లు , మునిసిపాలిటీల పరిధిలో 237 అమ్మా క్యాంటీన్లు ప్రజలకు సేవలందిస్తున్నాయి. అయితే, ఇటీవల కాలంలో ఈ క్యాంటీన్లలో అందిస్తున్న ఆహార నాణ్యత, రుచి అంతగా బాగోలేదని ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వచ్చింది. అమ్మ క్యాంటీన్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే ఆధునీకరించాలని సంబంధిత ప్రభుత్వ శాఖల కార్యదర్శులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
దళితుడు సీఎం కావడం సులభం కాదు!
సీఎంతో రెనాల్ట్ ఉన్నతాధికారుల భేటీ
ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ ’రెనాల్ట్ గ్రూప్’ ఉన్నతాధికారుల బృందం సచివాలయంలో సీఎం జోసెఫ్ విజయ్తో సమావేశమైంది. ఈ భేటీలో తమిళనాడులో ప్రస్తుతం రెనాల్ట్ సంస్థ నిర్వహిస్తున్న కార్ల ఉత్పత్తి , ఇంజనీరింగ్ కార్యకలాపాలతో పాటు భవిష్యత్తులో రాష్ట్రంలో చేపట్టబోయే సరికొత్త విస్తరణ ప్రాజెక్టులు, పెట్టుబడుల ప్రణాళికలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రెనాల్ట్ గ్రూప్ తరఫున మిస్టర్ స్టీఫెన్ డైబ్లెస్, హంసాదిర్ , నరసింహన్ పురుషోత్తమన్ ఉన్నారు. అలాగే, రామ్కో గ్రూప్ ఉన్నతాధికారులు సీఎంతో భేటీ అయ్యారు..ఈ భేటీలో రామ్కో గ్రూప్ తమిళనాడులో ప్రస్తుతం నిర్వహిస్తున్న వివిధ రకాల వ్యాపార రంగాలు (సిమెంట్, టెక్స్టైల్స్, సాఫ్ట్వేర్ తదితరాలు), వాటి పనితీరుతో పాటు భవిష్యత్తులో రాష్ట్రంలో చేపట్టబోయే విస్తరణ ప్రణాళికలు, సరికొత్త అభివద్ధి అవకాశాలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో రామ్కో గ్రూప్ చైర్మన్ ప.ఆర్. వెంకట్రామ రాజా, మేనేజింగ్ డైరెక్టర్ అభినవ్ రాజా ఉన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుపై సీఎం విజయ్ అధికారులతో సోమవారం సమీక్షించారు. విద్యుత్ కోతలు లేకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఇంధన వనరుల శాఖ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమిళనాడు విద్యుత్ బోరు, దాని అనుబంధ సంస్థల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, డిమాండ్, పంపిణీ, ఆర్థిక పరిస్థితి , భవిష్యత్తు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు.


