తమిళసినిమా: స్టోన్బెంచ్ స్టూడియోస్ సంస్థ అధినేతలు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, కార్తీకేయన్ సంతానం, స్పిరిట్ మీడియా అధినేత దగ్గుబాటి రానా కలిసి నిర్మించిన చిత్రం నీళిరా. బాలుమహేంద్ర శిష్యుడు సోమినాదన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో నటుడు నవీన్ చంద్ర, కపిలావేణు, విదూ, రూపా కొడువర్, కయల్ విన్సెంట్, సిద్దు కుమరేశన్ తదితరులు ప్రదాన పాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ సందర్బంగా చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలుమహేంద్ర సతీమణి అఖిల ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. కాగా ఈ సమావేశానికి దర్శకుడు వెట్రిమారన్, ఆర్కే.సెల్వమణి, లింగుసామి, రాజుమురుగన్, రామ్కుమార్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నిళీరా చిత్ర ప్రత్యేకత గురించి మాట్లాడుతూ యూనిట్ సభ్యులను ప్రశంసించారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన రానా దగ్గుబాటి మాట్లాడుతూ దర్శకుడు సోమినాదన్ సొంత జీవితమే ఈ చిత్రం అని పేర్కొన్నారు. ఈ వేదికపై పలువురు దర్శకులు మాట్లాడుతూ జర్మనీ, వియత్నాం వంటి దేశాల్లో జరిగిన పోరాటాల గురించి అనేక చిత్రాలు రూపొందాయని, అయితే మన దేశం గురించి, మన మన్ను గురించి చిత్రాలను ఎవరూ నిర్మించడం లేదని అన్నారన్నారు. అలాంటి చిత్రాలను నిర్మించడానికే గత ఐదేళ్ల క్రితం ప్రారంభించిన సంస్థ స్పిరిట్ మీడియా అని చెప్పారు. ఈ సంస్థపై మన సంస్కృతిని ప్రతిఫలించే విధంగా, మలయాళం, మరాఠి, ఇప్పుడు తమిళం, తెలుగు భాషల్లో చిత్రాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. స్టోన్ బెంచ్ స్టూయోస్ సంస్థతో కలిసి ఈ నీళిరా చిత్రంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ నీళిరా వంటి పోరు కథా చిత్రాలకు సరైన వేదిక సినిమా మాధ్యమం అని కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు.
నీళిరా చిత్ర ఆడియోను ఆవిష్కరించిన
అఖిలా బాలుమహేంద్ర, సినీ ప్రముఖులతో యూనిట్ సభ్యులు


