సీపీఐకు ఐదు సీట్లు
నేతలతో సీపీఎం షణ్ముగం భేటీ
సందిగ్ధంగా వీసీకే, ఎంఎన్ఎంకే
పరిస్థితి?
సీపీఎం నేత వీర పాండియన్కు ఒప్పందపత్రం అందజేస్తున్న స్టాలిన్
సాక్షి, చైన్నె:డీఎంకే కూటమిలో 11కు పైగా పార్టీలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్కు 28 సీట్లు కేటాయించారు. ఎండీఎంకేకు నాలుగు ఇవ్వగా, మూడు స్థానాలలో డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో అభ్యర్థులను నిలబెట్టేందుకు ఆ పార్టీ నేత వైగో నిర్ణయించారు. ఇక ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్కు రెండు స్థానాలు ఇచ్చారు. మనిద నేయమక్కల్ కట్చి, కొంగు దేశీయ మక్కల్ కట్చిలకు తలా రెండు స్థానాలు ఇవ్వగా, డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలోనే తమ అభ్యర్థుల పోటీ అని ఆ పార్టీ నేతలు జవహిరుల్లా, ఈశ్వరన్ ప్రకటించారు. ఇక సీపీఎం, సీపీఐ, వీసీకే, మక్కల్ నీది మయ్యం, డీఎండీకేలకు సీట్లు కేటాయింపు ముగించాల్సి ఉంది.
కమ్యూనిస్టులకు..
సీపీఎం లెక్క తేల్చడం కష్టతరంగా మారింది. కాంగ్రెస్కు అధిక సీట్లు ఇచ్చినప్పుడు తమకు కూడా సంఖ్య పెంచాలని ఆ పార్టీ కార్యదర్శి షణ్ముగం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే సీపీఐకు ఇచ్చినట్టే సీపీఎంకు కూడా ఐదు స్థానాలే అని డీఎంకే కరాఖండిగా తేల్చి చెప్పినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో బుధవారం మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులతో షణ్ముగం విస్తృతంగా సమావేశమయ్యారు. గురువారం డీఎంకేతో ఒప్పందాలకు అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇక వీసీకే, మక్కల్ నీదిమయ్యంకు తలా ఐదు సీట్లే ఇవ్వడానికి డీఎంకే నిర్ణయించి ఉండడంతో ఆ రెండు పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే. అలాగే డీఎండీకేకు 10 సీట్లు అన్న చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ఆ పార్టీకి కూడా ఐదు స్థానాలను తగ్గించే దిశగా డీఎంకే నిర్ణయించినట్టు సమాచారం. మిగిలిన చిన్న పార్టీలకు తలా ఓ సీటు ఇవ్వడానికి కసరత్తు పూర్తి చేశారు. సీట్ల సర్దుబాటును రెండు రోజులలో ముగించే విధంగా పార్టీ కోశాధికారి టీఆర్ బాలు నేతృత్వంలోని కమిటీకి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. ఆ తదుపరి నియోజకవర్గాల కేటాయింపును ముగించి, మ్యానిఫెస్టో ప్రకటన, రాష్ట్ర పర్యటన కార్యాచరణలో స్టాలిన్ ఉన్నట్టు అన్నా అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా బుధవారం నుంచి తమిళనాడులో ఎన్నికలలో పోటీకి సిద్ధంగా ఉన్న ఆశావహులతో ఇంటర్వ్యూలపై స్టాలిన్ దృష్టి పెట్టారు. తొలిరోజు తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలోని ఆశావహులను ఇంటర్వ్యూ చేశారు.
రెండు రోజుల్లో
ముగింపునకు ఆదేశాలు
సీపీఐకు ఐదు సీట్లు..
గత ఎన్నికలలో వలే తమకు ఆరు సీట్లు ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతూ వచ్చింది. మూడు విడతల చర్చల అనంతరం ఎట్టకేలకు ఐదు సీట్లతో సర్దుకోవాల్సి వచ్చింది. దీంతో బుధవారం అన్నా అరివాయలయంలో డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్, సీపీఐ ప్రధాన కార్యదర్శి వీర పాండియన్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం మీడియాతో వీర పాండియన్ మాట్లాడుతూ, ఈసారి కూటమిలోకి అధిక పార్టీలు చేరిన దృష్ట్యా, సీట్ల సంఖ్య తగ్గించుకోవాలన్న డీఎంకే విజ్ఞప్తి మేరకు ఐదు స్థానాలను తీసుకున్నామని వివరించారు. తమ లక్ష్యం తమిళనాడులోకి బీజేపీ ప్రవేశించకూడదని, డీఎంకే గెలుపు కోసం శ్రమిస్తామన్నారు.


