ఆగివున్న లారీని ఢీకొన్న కారు
● వైద్య విద్యార్థిని మృతి ● మరో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
అన్నానగర్: క్రోంపేటలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ మిస్బా కాలేజీ విద్యార్థిని ఫాతిమా (21) సహా విద్యార్థులు 10 మంది బుధవారం రాత్రి రెండు కారులో మామల్లాపురం చేరుకున్నారు. తరువాత, గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, వారు కారులో క్రోంపేట్ వైపు తిరిగి వస్తున్నారు. తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో, తిరుపోరూర్–కాలవాక్కం బైపాస్ రోడ్డులోని కాలవాక్కం వద్ద వారికారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. మిస్బా ఫాతిమా సహా విద్యార్థులు శిథిలాలలో చిక్కుకుని కేకలు వేశారు. దీంతో షాక్కు గురైన మరో కారులో ఉన్న స్నేహితులు, ప్రయాణిస్తున్న వాహనదారులు వెంటనే కారులో చిక్కుకున్న వారిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన మిస్బా ఫాతిమా అక్కడికక్కడే మరణించింది. కారులో ఉన్న నలుగురు విద్యార్థులు అభినందన్, సేన్బాగ వినాయగం, మహమ్మద్ అలీ, విద్యార్థిని నవ్య తీవ్రంగా గాయపడి ప్రాణాల కోసం పోరాడారు. వారందరూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపోరూర్ ఇన్స్పెక్టర్ రాజంగం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన విద్యార్థిని మృతదేహాన్ని శవపరీక్ష కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. రోడ్డు పక్కన లారీని పార్క్ చేసిన కడలూరుకు చెందిన డ్రైవర్ సుభా ష్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
బాలికపై తండ్రి, సోదరుడి లైంగిక దాడి
తిరువళ్లూరు: బాలికపై మూడేళ్ల నుంచి లైగింక దాడికి పాల్పడిన వ్యవహరంలో తండ్రి, సోదరుడికి 14 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తిరువళ్లూరు పోక్సో న్యాయస్థానం తీర్పును వెలువరించింది. వివరాలు.. చైన్నెకు చెందిన చెందిన మైనర్ యువతిపై ఆమె తండ్రి ఉదయకుమార్(48), సోదరుడు జై అలియాస్ జయకుమార్(26) మూడు సంవత్సరాల నుంచి లైగింక దాడికి పాల్పడినట్టు 2023లో కేసు నమోదయ్యింది. కేసు నమోదు చేసుకున్న తిరువొత్తియూర్ పోలీసులు అప్పట్లో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా, 90 రోజుల తరువాత ఇద్దరూ బెయిల్పై విడుదలయ్యారు. ఈ క్రమంలో కోర్టు విచారణ తిరువళ్లూరు పోక్సో న్యాయస్థానంలో సాగింది. విచారణ పూర్తి కాగా న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. బాలికపై మూడేళ్ల నుంచి లైగింక దాడికి పాల్పడినట్టు తండ్రి, సోదరుడికి 14 ఏళ్ల జైలు శిక్షతో పాటూ రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. దీంతో పాటు బాధిత బాలికకూ రూ. 5 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. కాగా తీర్పు అనంతరం పోలీసులు నిందితులను పుళల్ జైలుకు తరలించారు.
ఒక్క ఓటు వృథా కానివ్వకండి
సాక్షి, చైన్నె: ఒక్కటంటే ఒక్క ఓటు కూడా వృథా కానివ్వకుండా ఎన్నికల విదులు విస్తృతం చేయాలని టీవీకే జిల్లాల కార్యదర్శుల సమావేశంలో నిర్ణయించారు. పనయూరులోని పార్టీ కార్యాలయంలో టీవీకే జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నిర్వాహకుల సమావేశం గురువారం జరిగింది. ఇందులో పార్టీ అధినేత విజయ్ పాల్గొంటారని ముందుగా సమాచారం వెలువడింది. అయితే ఆయన హాజరు కాలేదు. ఆయన తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, వర్కింగ్ కమిటీ కన్వీనర్ సెంగొట్టయ్యన్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున, ప్రచార కార్యదర్శి నాంజిల్ సంపత్ తదితరులు నేతృత్వం వహించారు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి గురించి సమీక్షించారు. విజయ్ మీట్ ది పీపుల్ పర్యటనలను విస్తృతం చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి చర్చించారు. పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగడమే కాకుండా, టీవీకేకు మద్దతుగా ఉన్న ఒక్కటంటే ఒక్క ఓటు కూడా వృథా కాకుడదని, ఆమేరకు పని తీరు వేగం పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రజలలో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలు విస్తృతం చేయడంతో పాటూ అధినేత ఆదేశాలకు అనుగుణంగా పర్యటనలు, ప్రచారాలపై దృష్టి సారించే విధంగా జిల్లాల కార్యదర్శులకు సూచనలు ఇచ్చారు.
ఆగివున్న లారీని ఢీకొన్న కారు


