కరుణ కాదు.. హక్కులే ముఖ్యం
సీఎం స్టాలిన్
సాక్షి,చైన్నె : దివ్యాంగులపై కరుణ చూపించడం కాదని, వారి హక్కులు సక్రమంగా కల్పించ బడుతున్నాయా..? అన్నదే ముఖ్యం అని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఉత్తమ సేవకులకు అవార్డు, సంక్షేమ పథకాలతో దివ్యాంగుల దినోత్సవ వేడుక బుధవారం వళ్లువర్ కోట్టం వేదికగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దివ్యాంగుల దినోత్సవ 2025 పోటో ఎగ్జిభిషన్ను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు, మోటారు సైకిళ్లతో పాటూ వివిధ సంక్షేమ పథకాలను అందజేశారు. అలాగే ఉత్తమ సేవలను అందిస్తున్న సంస్థలు, దివ్యాంగులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈసందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, దివ్యాంగులకు తాము ఎల్లప్పుడు మద్దతుగానే ఉంటామని వివరించారు.
కలైంజ్ఞర్ మార్గంలోనే..
కలైంజ్ఞర్ కరుణానిధి చూపిన మార్గంలో ద్రావిడ మోడల్ ప్రభుత్వం వారి హక్కులు సాధన, వారికి కావాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలను దరిచేర్చడంలో ముందున్నట్టు పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా వళ్లువర్ కోట్టంను నిర్వీర్యం చేశారని గుర్తుచేస్తూ, తాజాగా తాము అభివృద్ధి చేశామని తెలిపారు. పనరుద్దరణ తదుపరి ఇక్కడ దివ్యాంగుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తొలిసారిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయనంతగా పథకాలను విస్తృతం చేశామని పేర్కొంటూ దివ్యాంగులకు స్థానిక సంస్థలలో నామినేటెడ్ కోటా సీట్లకు గాను రిజర్వేషన్ను కల్పించామన్నారు. ఇక స్థానిక సంస్థలో దివ్యాంగుల గొంతుక జ్వలించనున్నట్టు పేర్నొన్నారు. మెరీనా బీచ్, బెసెంట్ నగర్ బీచ్ తదితర ప్రాంతాలలో అలలను ఆస్వాధీంచేందుకు వీలుగా దివ్యాంగుల కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశామని, క్రీడా రంగంలోనూ వివిధ పోటీలను విస్తృతం చేశామని వివరిస్తూ, వివిధ జిల్లాల్లో పారా స్పోర్ట్స్ మైదానాలను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నామని ఫ్రకటించారు. రాష్ట్ర ప్రజల గొంతుకగా ద్రావిడ మోడల్ ప్రభుత్వం ఉందని పేర్కొంటూ, దివ్యాంగులపై కరుణ చూపించడం కాదని, వారి హక్కులను సాధించి, వారి జీవితాలలో వెలుగు నింపే దిశగా ఈ ప్రభుత్వం ఉరకలు తీస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రులు గీతాజీవన్, టీఆర్పీ. రాజా, రాజకన్నప్పన్, ఎం. సుబ్రమణియన్, మేయర్ ప్రియ, ఎమ్మెల్యేలు ఎలిళన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం తదితరులు పాల్గొన్నారు.
కరుణ కాదు.. హక్కులే ముఖ్యం


