క్లుప్తంగా
ప్రభుత్వ బస్సు–వ్యాన్ ఢీ
● ఇద్దరు మహిళలు మృతి
●10 మందికి తీవ్ర గాయాలు
అన్నానగర్: కీల్పాక్కం సమీపం కూవత్తూరు కీలర్కొల్లై ప్రాంతానికి చెందిన మహిళలు కేళంబాక్కం పక్కనే ఉన్న పుదుప్పాక్కంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం, అదే ప్రాంతానికి చెందిన బాను (24), ఉమా (40) సహా 20 మంది మహిళలు ఒక వ్యాన్లో పనికి వెళ్లారు. ఆ వ్యాన్ ఉదయం 5.30 గంటలకు కీల్పాక్కం సమీపంలోని కున్నత్తూర్ ఈస్ట్ కోస్ట్ రోడ్డులో వచ్చింది. ఆ సమయంలో, ప్రభుత్వ బస్సు చైన్నె నుండి పాండిచ్చేరికి పోతోంది. అప్పుడు ప్రభుత్వ బస్సు, వ్యాన్ అకస్మాత్తుగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. వ్యాన్లో ఉన్న బాను, ఉమ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబాల రోదనలతో ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది.
రూ. 3 లక్షల చొప్పున పరిహారం
కొరుక్కుపేట: చెంగల్ పట్టు జిల్లా తిరుక్కజుకుంద్రం తాలూకా, సోమవారం ఉదయం, చైన్నె నుంచి కున్నత్తూర్ గ్రామం మీదుగా పుదుచ్చేరికి వెళ్తున్న ప్రభుత్వ బస్సు, కీజర్కొల్లై గ్రామం నుండి అలందూర్లోని ఓ ప్రైవేట్ కంపెనీకి ఉద్యోగులను తీసుకెళ్తున్న ప్రైవేట్ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు ఉమా, బాను అక్కడికక్కడే మరణించారు. ఈ వార్త విన్న సీఎం స్టాలిన్ మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల సహాయ సహాయం ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడివారిని చెంగల్పట్టు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, పుదుచ్చేరి ప్రభుత్వ వైద్య కళాశాల, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి సాధ్యమైనంత ఉత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష, స్వల్ప గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ. 50 వేలు చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆదేశించారు.
సీనియర్ నటి దేవిక భర్త
దేవదాస్ కన్నుమూత
తమిళసినిమా: దివంగత సీనియర్ నటి దేవిక భర్త దేవదాస్ ఆదివారం ఉదయం చైన్నెలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈయన వయసు 88 ఏళ్లు. సినీ నిర్మాత ఎష్ఎంఎస్ సుందరరామన్ కొడుకులలో దేవదాస్ ఒకరు. దివంగత ప్రఖ్యాత దర్శకుడు భీంసింగ్ వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ తరువాత వెగుళి పెన్ అనే చిత్రాన్ని తమిళం,తెలుగు భాషల్లో స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కాగా సీనియర్ నటి దేవికను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తరువాత విడిపోయారు. వీరి కూతురే నటి కనక. కాగా దేవదాస్ కూతురు కనకకు కూడా దూరంగా జీవిస్తువచ్చారు. కాగా ఇటీవల వృద్ధాప్యం కారణంగా అనారోగ్యానికి గురైన దేవదాస్ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు.
వదినను హత్య చేసిన
మరిది అరెస్టు
అన్నానగర్: కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని కట్టుకుడలూర్ ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణన్ భార్య తమిళరసి (35). వీరికి ఇద్దరు కుమారులు హరికృష్ణన్ (13), హరిశక్తి (10) ఉన్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా గత 10 సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారు. గోపాలకృష్ణన్ ప్రస్తుతం చైన్నెలో ఉంటున్నారు. తమిళరసి తన ఇద్దరు కుమారులతో కలిసి తన భర్త తమ్ముళ్లయిన బాలకృష్ణన్, మురుగనాథం ఇంట్లో నివసిస్తోంది. ఈ స్థితిలో కొన్ని రోజుల క్రితం, బాలకృష్ణన్, మురుగానందం తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ తమిళరసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళపై అత్యాచారాల నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు మురుగానందాన్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బాలకృష్ణనన్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బాలకృష్ణన్ తాగి ఇంటికి వచ్చాడు. తర్వాత తమిళరసితో గొడవ పడ్డాడు. తర్వాత తన వద్ద దాచిన కత్తితో తమిళరసి తలను నరికి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడే ఉన్న బాలకృష్ణన్ను అరెస్టు చేశారు.
రూ.46 లక్షలు మోసం
– మహిళా మేనేజర్ అరెస్టు
అన్నానగర్: కన్యాకుమారి జిల్లా తేంగపట్టణంలోని ప్రైవేట్ ఆర్థిక సంస్థలో కాంజిరావిలైకి చెందిన బిందు (46) బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఈ స్థితిలో ప్రాంతీయ మేనేజర్ జగన్ డార్విన్ (35) తనిఖీ చేశారు. ఆ సమయంలో, బ్రాంచ్ మేనేజర్ బిందు నగలు తాకట్టు పెట్టిన కస్టమర్లకు నకిలీ రశీదులతో రూ. 46 లక్షలు దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. ఈ విషయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా, పోలీసులు బిందు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్లుప్తంగా


