
తూత్తుకుడికి మహర్దశ
షిప్యార్డ్ (ఫైల్)
తూత్తకుడి ఓడ రేవు
దక్షిణ తమిళనాడులో అతి పెద్ద ఓడ రేవు నగరంగా ఉన్న తూత్తుకుడికి మహర్దశ సంతరించుకుంది. రూ.30 వేల కోట్లతో 2 అల్ట్రా మెగా ప్రాజెక్టులుగా షిప్ యార్డ్లు (నౌకల తయారీ కేంద్రం) నిర్మాణానికి చర్యలు చేపట్టారు. 55 వేల మందికి ఉపాధి కల్పన దిశగా ఈయార్డ్లు రూపుదిద్దుకోనుంది.
సాక్షి, చైన్నె: దక్షిణ భారతావణిలో ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నం తదుపరి అతి పెద్ద ఓడ రేవుగా తూత్తుకుడి ప్రఖ్యాతి గాంచింది. దేశాన్ని ఏలిన బ్రిటిషు వాళ్లు వ్యాపార రీత్యా ప్రప్రథమంగా ఈ గడ్డ మీదే అడుగు పెట్టారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన సుబ్రమణ్య భారతీయార్, వీరపాండి కట్టబొమ్మన్, వివో చిదంబరం పిళ్లైల వంటి యోధులు పుట్టిన గడ్డ కూడా ఇదే. తూత్తుకుడి జిల్లా కేంద్రమే కాదు, కార్పొరేషన్ కూడా. అలాగే తూత్తుకుడి జిల్లాలోని రెండవ అతిపెద్ద నగరంగా ఉన్న కోవిల్పట్టి వందలాది అగ్గిపెట్టె కర్మాగారాలు, వేరుశనగ మిఠాయిలు, బాణా సంచాలు, స్పిన్నింగ్ మిల్లుతో నిండి ఉంటుంది. అదే సమయంలో ఇక్కడి పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున యువకులు ఆర్మీలో చేరి ఉన్నారు. వివిధ క్రీడలలో రాణిస్తున్నారు. ఈ పరిస్థితులలో ఇక్కడి తోనుకల్ గ్రామాలలోని మొట్టైమలై పాదాల వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో విమాన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పనులపై టిడ్కో వర్గాలు దృష్టి పెట్టాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలోని ఇస్రో అంతరిక్ష కేంద్రంకు ప్రత్యామ్నాయంగా ఇక్కడి కుల శేఖర పట్నంలో మరో లాంచ్ పాడ్ సిద్ధమవుతున్నది. ఎరో స్పేస్, సౌర విద్యుత్ రంగానికి పెద్ద పీట వేసే రీతిలో ఈపరిసరాలలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందడుగు వేస్తూ వస్తున్నాయి. ఇక తూత్తుకుడి ఆథ్యాత్మికంగా ఓ వైపు తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి, మరో వైపు ముత్తారమ్మన్ ఆలయం వెలిసి ఉన్నాయి. తాజాగా, ఈ ఓడరేవుల నగరం దక్షిణ తమిళనాడులోనే ఉద్యోగ కల్పన బాండాగారంగా మారనుంది.
అల్ట్రా మెగా ప్రాజెక్టులుగా షిప్ యార్డ్లు
తూత్తుకుడి సముద్ర తీరాన్ని పరిగణించి తమిళనాడు గ్రీన్ ఫీల్డ్ కమర్షియల్ షిప్యార్డులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన రెండు అవగాహన ఒప్పందాలపై (ఎంఓయూ) సంతకాలు జరిగాయి. రూ. 30 వేల కోట్లతో ఈ రెండుప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా 55 వేల మందికి ఉద్యోగ కల్పన దిశగా ఈ ప్రాజెక్టులు నిలవబోతున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారతదేశపు ప్రముఖ రక్షణ షిప్యార్డ్లలో ఒకటైన మజగాన్ డాక్ షిప్సుల్ డెర్స్ ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. మరో యార్డ్ను కొచ్చిన్ షిప్యార్డ్ సంస్థ చేపట్టనుంది. తలా రూ. 15 వేలు చొప్పున పెట్టుబడులు పెట్టే విధంగా ముందుకు వచ్చాయి. ఈ విషయగా పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజ పేర్కొంటూ ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా వర్ణించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్రంలో నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. అందుకే ఈ రెండు అల్ట్రా–మెగా ప్రాజెక్టుల ద్వారా నౌకానిర్మాణం, సముద్ర ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా మారబోతున్నాయని ధీమా వ్యక్తంచేశారు. ఈ రంగంలో ఆర్థిక వృద్ది, ఉద్యోగ కల్పన, స్థిరత్వానికి అపూర్వమైన అవకాశాలను మరింత మార్గం లభించనుందన్నారు. ఇలాంటి మరిన్ని షిప్యార్డులతో కలిసి పనిచేయడానికి , తమిళనాడులో మరిన్ని షిప్ నిర్మాణ కార్యకలాపాలకు తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాబోయే కొన్ని వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగానికి సంబంధించిన ఓ విధానాన్ని ప్రకటించబోతున్నట్టు వ్యాఖ్యలు చేశారు.

తూత్తుకుడికి మహర్దశ