
క్లుప్తంగా
ఊటీలో జర జాగ్రత్త!
అన్నానగర్: ఊటీకి వెళ్లే పర్యాటకులు జర జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. కేరళకు చెందిన ఒక యువతి కుటుంబంతో కలిసి 5వ తేదీన నీలగిరి జిల్లాలోని ఊటీకి వెళ్లింది. వారు ఒక ప్రైవేట్ హోటల్లో గది తీసుకుని బస చేశారు. యువతి హోటల్లోని బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా సెల్ఫోన్లోని ఫ్లాష్లైట్ వెలిగింది. ఆమె భయపడి చుట్టూ చూసింది. అప్పుడు, సమీపంలోని గది లోని చిన్న రంధ్రం ద్వారా ఎవరో తనను సెల్ ఫోన్లో వీడియో తీస్తున్నట్లు చూసింది. అది హోటల్ సిబ్బంది గది అని తెలిసింది. వెంటనే షాక్ అయిన యువతి పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఊటీ వెస్ట్ పోలీసులు హోటల్కు వెళ్లి విచారణ చేశారు. అక్కడి ఉద్యోగుల సెల్ఫోన్లను స్వాధీ నం చేసుకుని తనిఖీ చేశారు. కేరళలోని మలప్పురానికి చెందిన నితీష్ (30) సెల్ఫోన్లో యువతులు స్నానం చేస్తుండగా వీడియో తీసినట్టు తెలిసింది. పోలీసులు నితీష్ను అరెస్టు చేశారు.
చిన్నారికి కాలేయ మార్పిడి
సాక్షి, చైన్నె: ఎంజీఎం హెల్త్ కేర్లో ఐదు నెలల చిన్నారికి మోనోసెగ్మెంటల్ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ ప్లాంట్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను శుక్రవారం ఎంజీఎం వైద్యులు త్యాగరాజన్ శ్రీనివాసన్, శ్రీ కాంత్ తుమ్మల, ఎల్ సౌందరరాజన్, దినేష్ బాబు, నివాష్ చంద్రశేఖరన్ బృందం మీడియాకు వివరించింది. కామెర్లతో కృష్ణగిరికి చెందిన దంపతుల ఐదు నెలల చిన్నారి బాధ పడుతూ తమ ఆస్పత్రిలో చేరినట్టు వివరించారు. తల్లి కాలేయం కొంత భాగాన్ని ఆ బిడ్డ శరీరానికి సరిపోయేలా సేకరించి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. 10 గంటల పాటు శస్త్ర చికిత్స జరిగిందని పేర్కొన్నారు.
కలప లారీ బోల్తా
–స్తంభించిన రాకపోకలు
తిరువొత్తియూరు. కోయంబేడు సమీపంలో పూల మార్కెట్ హైవేలో కలప లారీ బోల్తా పడింది. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. అరుంబాక్కం నుంచి శుక్రవారం ఉద యం మదురవాయల్ వైపు సిమెంట్ మిక్చర్ లారీ బయలుదేరింది. లారీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో అరుంబాక్కం నుంచి కోయంబేడు వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు, కోయంబేడు మార్కెట్ నుంచి వెళ్లే వాహనాలు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలిసి కోయంబేడు ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి బోల్తా పడిన లారీని తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
పుళల్ జైలు ఖైదీ మృతి
అన్నానగర్: అనారోగ్యంతో పుళల్ జైలులోని ఓ ఖైదీ మృతి చెందాడు. పుళల్ జైలులో వెయ్యి మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వారిలో వేలచేరి కిల్కట్టాలైకు చెందిన పన్నీర్ సెల్వం (60) మోసం కేసులో అరెస్టయ్యాడు. గత ఏడాది డిసెంబర్ నుంచి జైలులో ఉన్నాడు. పక్షవాతం కారణంగా అతను చైన్నెలోని స్టాన్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ స్థితిలో చికిత్స పొందుతూ పన్నీర్సెల్వం గురువారం మృతిచెందాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
కాలువలో గల్లంతైన
వ్యక్తి మృతి
తిరువళ్లూరు: బ్రిడ్జి పైనుంచి కృష్ణా కాలువలో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహం గురువారం రాత్రి లభ్యమైంది. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటకు చెందిన కన్నన్ కుమారుడు శరవణన్. ఇతను ఎగువచిట్రంబాక్కం సమీపంలోని బ్రిడ్జిపై నుంచి ప్రమాదవశాత్తు కృష్ణా కాలువలో పడి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. విషయం తెలిసి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు గాలించి గురువారం రాత్రి మృతదేహాన్ని వెలికితీశారు. పెనాలూరు పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగం పేరుతో మోసం
–దంపతుల అరెస్టు
అన్నానగర్: ప్రభుత్వ ఉద్యోగం తీసిస్తామని నమ్మించి రూ.18లక్షలు మోసం చేసిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు చైన్నెలోని అయనవరంలోని చక్రవర్తినగర్కు చెందిన అయ్యంగార్ (62). ఇతని కుమార్తె హేమావతి. హేమావతి భర్త గోపీనాథ్. 2021లో హేమావతి పుట్టింటికి ప్రసవం కోసం వచ్చింది. ఆ సమయంలో ఆమెను చూడడానికి వచ్చిన బంధువులు చంద్రశేఖర్, భార్య సుభద్ర మాట్లాడుతూ మీ అల్లుడికి విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగం ఇప్పిస్తామని అని అయ్యంగార్తో చెప్పారు. నమ్మి అయ్యంగార్ అతనికి రూ.18 లక్షలు ఇచ్చాడు. డబ్బు తీసుకున్న చంద్రశేఖర్, అతని భార్య గోపీనాథ్ కు ఉద్యోగం తీసివ్వలేదు, డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదు. మోసపోయామని తెలుసుకున్న దంపతులు అయనవరం క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసానికి పాల్పడిన చంద్రశేఖర్, సుభద్రను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

క్లుప్తంగా