
క్లుప్తంగా
విద్యార్థిని బలవన్మరణం
తిరువొత్తియూరు: నామక్కల్ జిల్లా పరమతి వెల్లూర్ తాలూకా, వడకర యత్తూరు, ప్రాంతానికి చెందిన నటరాజ్ (45) అతని కుమార్తె ప్రాణిక (13) ఆ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో విద్యార్థి ప్రాణిక, బుధవారం సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో చీరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రాణిక తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసరికి, కుమార్తె ఉరి వేసుకుని వేలాడుతూ ఉండటం చూసి వారు బోరున విలపించారు. తరువాత, ఇరుగు పొరుగు వారు బాలికను చికిత్స కోసం వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ పరీక్షించిన వైద్యులు ప్రాణిక మృతి చెందిందని తెలిపారు. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ప్రభుత్వ బస్సు అద్దం ధ్వంసం
తిరుత్తణి: ప్రభుత్వ బస్సు అద్దం ధ్వంసం సంఘటన ప్రభుత్వ డిగ్రీ కళాశాల బస్టాప్ వద్ద కలకలం రేపింది. తిరుత్తణి సమీపంలోని తిరుపతి చైన్నె–జాతీయ రహదారి సమీపంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు బస్సుల్లో తిరుత్తణికి వచ్చి చదువుకుంటున్నారు. ఈక్రమంలో గురువారం మధ్యాహ్నం కళాశాల ముగిశాక విద్యార్థులు బస్సుల కోసం బస్టాప్ వద్ద వేచివున్నారు. ఈ సమయంలో తిరుత్తణి నుంచి తిరువళ్లూరుకు వెళుతున్న బస్సులో విద్యార్థులు తొక్కిసలాడుతూ ఎక్కారు. బస్సు ఫుల్ కావడంతో డ్రైవర్ బస్సు కదల్చగా వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బస్సు అద్దాన్ని పగులగొట్టారు. డ్రైవర్ బస్సును అక్కడే ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుత్తణి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కారైకల్ ఆలయంలో
మామిడి పండగ సంబరాలు
● రాత్రిపూట అమృత నైవేద్య కార్యక్రమం
కొరుక్కుపేట: కారైకల్ భారతీ నగర్ వీధిలో అమ్మన్ ఆలయం ఉంది. దేవతను పూజించడానికి మామిడి పండ్లను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో కారైకల్ అమ్మన్ ఆలయంలో ఏటా మామిడి ఉత్సవ పండుగ సాంప్రదాయకంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ పండుగ 8వ తేదీ సాయంత్రం ప్రారంభమైంది. ఈ పండుగలో ప్రధాన కార్యక్రమం బుధవారం కారైకల్ అమ్మైయార్ ఆలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి పౌర సరఫరాల మంత్రి తిరుమురుగన్, ఎమ్మెల్యే నజీమ్ , పుదుచ్చేరి డిఐజి సత్య సుందరం, కారైకల్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మీ చౌజన్య, డీఎంకే వ్యవసాయ విభాగం నిర్వాహకుడు ప్రభు అలియాస్ సృథ్వీరాజ్, ఆలయ పరిపాలన అధికారి కనిదాసన్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మామిడి పండుగలో పాల్గొన్న భక్తులు తమ ఇళ్ల పైకప్పు నుంచి మామిడి పండ్లను విసిరారు. భక్తులు ఉత్సాహంగా మామిడి పండ్లను పట్టుకున్నారు. ఈ మామిడి పండ్లు తినడం వల్ల సంతానోత్పత్తిలో శుభం కలుగుతుందని నమ్ముతారు. అందువల్ల, చాలా మంది మహిళలు కూడా ఈ ఉత్సవంలో పాల్గొని మామిడి పండ్లను పట్టుకున్నారు. వీధుల నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు ఈ వేడుకలో పాల్గొని పూలమాలలు, పట్టు వస్త్రాలు సమర్పించి, దేవత దర్శనం చేసుకున్నారు.
రెండు లారీలు ఢీ
ముగ్గురు దుర్మరణం
తిరువొత్తియూరు: రెండు లారీలు ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందారు. విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై బైపాస్ రోడ్డు పునరుద్ధరణ పనులు గత కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తూత్తుకుడి నుంచి పళనికి పౌడర్తో కంటైనర్ లారీ అర్ధరాత్రి బయలుదేరింది. లారీడ్రైవర్ జయమురుగన్ లారీ నడుపుతున్నాడు. అదేవిధంగా, ఇలాంటి పౌడర్ పైపులను తీసుకుని వెళుతున్న మరో లారీ మదురై నుంచి తూత్తుకుడికి వెళుతోంది. ఈలారీని ముత్తురాజ్ నడుపుతున్నాడు. ఈరెండు లారీలు అరుప్పుకోట్టై జంక్షన్ వద్ద అరుప్పుకోట్టై–తూత్తుకుడి నాలుగు లేన్ల రహదారిపై గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్లు జయమురుగన్, ముత్తురాజ్, లారీలోని మరొక ప్రయాణికుడు మృతిచెందారు. సమాచారం అందుకున్న అరుప్పుకోట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని లారీల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
కూడంకుళంలో కలకలం
మత్స్యకారుల ఆందోళన
తిరువొత్తియూరు: నైల్లె జిల్లాలోని కుడంకుళం సమీపంలోని కూటపుల్లి గ్రామంలో నివసించే సంధ్య, సూసయి, సూడి, పెలికాన్, తిపుర్సియన్, దీపన్, దీపగురుస్, తెలస్, రూబన్ , అజిత్ అనే 10 మంది మత్స్యకారులు తమ సొంత పడవలను కలిగి ఉండి చేపల వేటలో నిమగ్నమై ఉన్నారు. ఈ పడవలు తమిళనాడు వెట్రి కలగం పార్టీ రంగులు పెయింటింగ్ చేసి వుండడాన్ని కారణంగా చూపుతూ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పడవల యజమానులకు ఈ నెలకు ఇవ్వాల్సిన 250 లీటర్ల సబ్సిడీ కిరోసిన్ నూనెను అధికారులు నిలిపివేశారు. దీంతో జాలర్లు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన కూడంకుళం ప్రాంతంలో కలకలం రేపింది.