
పారిశుధ్య కార్మికుల మేడే సంబరాలు
పళ్లిపట్టు: పొదటూరుపేటలో పారిశుధ్య కార్మికులు మే డే వేడుకలను గురువారం కోలాహలంగా నిర్వహించారు. కార్మికుల దినోత్సవం(మేడే) సందర్భంగా పొదటూరుపేట టౌన్ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న 40 మంది పారిశుధ్య కార్మికులు టౌన్ పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికుల దినోత్సవ వేడుకలు చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ సమక్షంలో సంఘం జిల్లా అధ్యక్షుడు జయచంద్రన్ కార్మికుల జెండాను ఆవిష్కరించారు. పాండ్యన్, ఉమాపతి, రవి సహా పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. పళ్లిపట్టు, తిరుత్తణిలో కార్మికులు మే డే నిర్వహించారు.
మే డే గ్రామసభలు
పళ్లిపట్టు: మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా గురువారం గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు ఆమోదించారు. పళ్లిపట్టు యూనియన్లోని 33 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. కొడివసల గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గ్రామ సభలో మహిళలు పాల్గొన్నారు. ఇందులో తహసీల్దారు భారతి, బీడీఓ అర్పుదరాజ్, వీఆర్ఓ భారతి, పంచాయతీ కార్యదర్శి భూపతి పాల్గొన్నారు. గ్రామ సభలో కలైంజ్ఞర్ ఇళ్లు నిర్మాణం పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులు ఎంపికకు సంబంధించి చర్చలు నిర్వహించి అర్హులను ఎంపిక చేశారు. డీఎంకే మండల కార్యదర్శి బీడీ చంద్రన్ పాల్గొన్నారు.