
కూరగాయల మార్కెట్ భవనం ప్రారంభం
తిరుత్తణి: తిరుత్తణి మపోసి రోడ్డులో రూ.3.02 కోట్ల వ్యయంతో నిర్మించిన కూరగాయల మార్కెట్ నూతన భవనాన్ని మంత్రులు బుధవారం ప్రారంభించారు. తిరుత్తణి మాపోసీ రోడ్డులో 40 ఏళ్లుగా కూరగాయల మార్కెట్ నిర్వహిస్తున్నారు. పలు దుకాణాల సముదాయ భవనం దుస్థితికి చేరుకోవడంతో మున్సిపాలిటీ ద్వారా కలైంజ్ఞర్ అభివృద్ధి నిధుల నుంచి రూ.3.02 కోట్లతో నూతన సముదాయ భవనం నిర్మించారు. జిల్లా కలెక్టర్ ప్రతాప్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం బుధవారం నిర్వహించారు. మంత్రులు నెహ్రూ, నాజర్ పాల్గొని నూతన భవనం ప్రారంభించారు. 97 దుకాణాల సముదాయ భవనం ద్వారా వ్యాపారులు, వినియోగదారులకు సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం నూతన భవనం నిర్మించినట్లు మంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాలు అభివృద్ధి కోసం డీఎంకే ప్రభుత్వం నాలుగేళ్లలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు ప్రధానంగా బస్టాండ్లు, కూరగాయల మార్కెట్లు, రోడ్లు, విద్యుద్దీపాలు, మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. అరక్కోణం ఎంపీ జగద్రక్షగన్, ఎమ్మెల్యేలు చంద్రన్, దురైచంద్రశేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతి, మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ స్వామిరాజ్ పాల్గొన్నారు.