
9 ఏళ్ల తర్వాత అరెస్ట్
తిరువళ్లూరు: పొన్నేరి సమీపంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు 9 ఏళ్ల తరువాత అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలుకా చోళవరం ప్రాంతానికి చెందిన ప్రకాష్(35). ఇతను 2013 సంవత్సరంలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యకేసు అప్పట్లో సంచలనం కలిగించింది. ఈసంఘటనపై చోళవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేశారు. విచారణ పూర్తి చేసి చార్జ్షీట్ను పోలీసులు కోర్టులో దాఖలు చేశారు. అయితే హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వున్న సుభాష్ కోర్టుకు గత 9 సంవత్సరాలుగా హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉండిపోయాడు. ఈక్రమంలో సుభాష్పై పొన్నేరి కోర్టు పీడీ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆవడి పోలీసు కమిషనర్ శంకర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు నిందితుడు సుభాష్ కోసం గాలించి అరెస్టు చేసి శుక్రవారం రాత్రి కోర్టులో హాజరుపరిచారు.
60 లక్షల మందికి
ఉచిత బస్ పాస్
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులకు ఉచిత బస్సు పాస్లను పంపిణీ చేయడానికి రవాణా సంస్థ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యా సంస్థలో చదువుకునే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉన్న విషయం తెలిసిందే. సోమవారం నుంచి బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది 60 లక్షల మందికి పాస్లను అందించేందుకు సిద్ధమయ్యారు. పాఠశాలల ద్వారా విద్యార్థులు ఈ పాస్లను పొందే అవకాశం కల్పించారు.
15 ఆన్లైన్ యాప్లకు నోటీసులు
అన్నానగర్: ఐపీఎల్ సందర్భంగా బెట్టింగ్లో పాల్గొన్న 15 ఆన్లైన్ యాప్లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఆన్లైన్ బెట్టింగ్ల నిర్మూలను తమిళనాడు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించింది. వారు ఆన్లైన్ జూదంలో పాల్గొన్న యాప్లు, కంపెనీలకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా బెట్టింగ్ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై విచారణ చేపట్టిన అధికారులు జూదంలో పాల్గొన్న 15 ఆన్లైన్ యాప్లకు నోటీసులు జారీ చేశారు. ఈ యాప్ల లైసెన్స్లు రద్దు చేయడానికి చర్యలు తీసుకున్నారు.
గోసంరక్షణ ట్రస్టుకు విరాళం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన గోసంరక్షణ ట్రస్టుకు ఓ దాత నగదు విరాళం చేశారు. రొంపిచెర్లకు చెందిన శ్రీకాంత్రెడ్డి రూ.లక్ష నగదును విరాళంగా అందజేశారు. నగదును దాత ఆలయ ఏఈఓకు రవీంద్రబాబుకు అందించారు. అనంతరం వారికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
శ్రీవారి సర్వదర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో సర్వదర్శనానికి 18గంటలు సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,721 మంది స్వామివారిని దర్శించుకోగా 36,011 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.42 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

9 ఏళ్ల తర్వాత అరెస్ట్

9 ఏళ్ల తర్వాత అరెస్ట్