
చైత్రమాస కృత్తికకు పోటెత్తిన భక్తజనం
తిరుత్తణి: చైత్రమాస కృత్తిక సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. కృత్తిక సందర్భంగా వేకువజామున మూలవర్లకు సుగంధ ద్రవ్యాలతో అభి షేక పూజలు చేపట్టి బంగారు కవచంతో అలంకరించి మహాదీపారాధన పూజలు చేశారు. వేకువజాము నుంచే భక్తులు వాహనాల ద్వారా తిరుత్తణికి చేరుకున్నారు. తమ మొక్కులు నిమిత్తం మెట్లు మార్గంతో పాటూ ఘాట్రోడ్డులో కొండ ఆలయం చేరుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ మాడ వీధుల్లో భక్తుల సందడి నెలకొంది. ఉచిత దర్శన క్యూలైన్లో 4 గంటలు, రూ.వంద ప్రత్యేక దర్శన మార్గంలో 3 గంటల పాటు భక్తులు వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. వేసవి ఎండల నేపధ్యంలో భక్తుల సౌకర్యాలు కల్పించే విధఃగా మాడ వీధుల్లో మ్యాట్ ఏర్పాటు చేసి తాగునీరు, పానకం సరఫరా చేసారు. సాయంత్రం 7 గంటలకు ఉత్సవర్లు వెండి నెమలి వాహనంలో మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కృత్తిక సందర్భంగా దాదాపు 50 వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసి హుండీల్లో కానుకలు చెల్లించి మెక్కులు చెల్లించారు.
చైత్ర బ్రహ్మోత్సవాలకు రేపు ధ్వజారోహణం
తిరుత్తణి మురునగ్ ఆలయంలో చైత్రమాస బ్రహ్మత్సవాలకు బుధవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. గురువారం వేకువజామున ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రా రంభమవుతాయి. 11 రోజుల పాటూ నిర్వహించే ఉత్సవ వేడుకలు సందర్భంగా రోజూ స్వామి వాహన సేవల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు. మే 7న రథోత్సవం, 8న దేవసేన కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహిస్తారు. ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ శ్రీధరన్, జాయింట్ కమిషనర్ రమణి తదితరుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల వేడుకలను ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు.

చైత్రమాస కృత్తికకు పోటెత్తిన భక్తజనం