
స్కౌట్ కార్యాలయం ప్రారంభం
తిరువళ్లూరు: సదురంగపేటలో ఏర్పాటు చేసిన నూతన స్కౌట్ కార్యాలయాన్ని తిరువళ్లూరు జిల్లా విద్యాశాఖ సీఈఓ రవిచంద్రన్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా సదురంగపేటలో నూతన స్కౌట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించే కార్యక్రమం ఆదివారం ఉదయం స్కౌట్ జిల్లా కార్యదర్శి డాక్టర్ శామ్సన్ ఇళంగో అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా సీఈఓ రవిచంద్రన్ హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రవిచంద్రన్ మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లాలో 150 పాఠశాలలో స్కౌట్ కార్యాలయం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. స్కౌట్లో చేరడం ద్వారా క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్న ఆయన, భవిష్యత్తులో మరింత మంది చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కౌట్కు సీఎస్ఆర్ ఫండ్ కింద కొత్త భవనాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారు. దీంతో పాటు తిరుత్తణి, పొన్నేరి, తిరువళ్లూరు, ఆవడి, అంబత్తూరు తదితర ప్రాంతాలకు చెందిన స్కౌట్ బృందాలు ఒక్కచోట చేరి సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కౌట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మురళీ, జిల్లా ఉప కార్యదర్శి పాండ్యన్తోపాటు పలువురు పాల్గొన్నారు.