
శ్రమిస్తే అధికారం తథ్యం
సాక్షి, చైన్నె: మరింతగా శ్రమిస్తే డీఎంకేను గద్దె దించడం సులభమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సూచించారు. 2026లో గెలుపు అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నట్టు, శ్రమిస్తే ప్రజల ఆదరణ మరింతగా దగ్గర అవుతుందని పేర్కొన్నారు. అన్నాడీఎంకే బలోపేతం దిశగా తాను రాష్ట్ర పర్యటన చేయబోతున్నట్టు పళణిస్వామి ప్రకటించినట్టుగా జిల్లాల కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఇటీవల బీజేపీ–అన్నాడీఎంకే కూటమి మళ్లీ ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమి ఏర్పాటుతో తొలిసారిగా జిల్లాల కార్యదర్శులతో భేటీకి పళణిస్వామి చర్యలు తీసుకున్నారు. పార్టీ పరంగా ఉన్న 80 మేరకు జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలు, శుక్రవారం సాయంత్రం ఎంజీఆర్ మాళిగైలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఇందులో బూత్ కమిటీల బలోపేతం, గ్రామాలలోకి జిల్లాల కార్యదర్శులు పర్యటించడం వంటి సూచనలు పళణిస్వామి చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కూటమిలోకి మరిన్ని పార్టీలు వస్తాయని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని పేర్కొనడం ప్రాధాన్యతకు దారి తీసినట్టు ఓ నేత పేర్కొన్నారు. పార్టీ పరంగా దూరం దూరంగా ఉన్న కొందరు నేతలను దరి చేర్చుకుని ఎన్నికలలోకి వెళ్దామన్న సూచనను పరోక్షంగా కొందరు నేతలు పళని స్వామి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. వీరిలో మాజీ సీఎం పన్నీరు సెల్వం, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం దినకరన్లు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతుండడంపై ప్రస్తావించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే ఈ సమావేశంలో మరింత ఆసక్తికర అంశాలతో చర్చలు జరిగినట్టు మరో నేత పేర్కొన్నారు. పళణిస్వామి రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నారని, కేడర్తో మమేకం అయ్యే విధంగా ఈ పర్యటన ఉండబోతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
జిల్లాల కార్యదర్శులకు
పళణి ఆదేశాలు
త్వరలో రాష్ట్ర పర్యటన