
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి
తిరువళ్లూరు: జిల్లాలోని వరి కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అగ్రి గ్రీవెన్స్డేలో రైతులు కలెక్టర్ ప్రతాప్కు సూచించారు. తిరువళ్లూరు కలెక్టరేట్లో అగ్రి గ్రీవెన్స్డే శుక్రవారం ఉదయం పది గంటల నుంచి రెండుగంటల వరకు జరిగింది. గ్రీవెన్స్డేకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు హాజరుకాగా, అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభం కాగానే రైతులు తమ సమస్యలపై మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా సింగారరాజపురం గ్రామానికి చెందిన చెరువును పూడికతీత చేపట్టాలని, వరి కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు అవినీతిని అరికట్టాలని, బండి కావనూరులో ఆక్రమణలకు గురైన చెరువులు, కాలువలను పరిరక్షించాలని విన్నవించారు. అంతేకాకుండా అడవి పందుల నుంచి రైతులను కాపాలని కోరారు. రైతులకు త్రీఫేజ్ కరెంట్ను 24 గంటలూ అందజేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.