
శివకార్తికేయన్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో కొత్త చిత
తమిళసినిమా: సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్. పిజా చిత్రంతో మొదలయిన ఈయన ప్రయాణం వరుస విజయాలతో దూసుకుపోతోంది. రజనీకాంత్ హీరోగా పేట, సిద్దార్ధ్ హీరోగా జిగర్తండా, రాఘవ లారెన్స్ కథానాయకుడిగా జిగర్తండా డబులెక్స్ వంటి చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం నటుడు సూర్య కథానాయకుడిగా ఈయన తెరకెక్కించిన చిత్రం రెట్రో నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మేడే సందర్బంగా విడుదల కానుంది. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే నటుడు శివకార్తీకేయన్ అయలాన్, మావీరన్, అమరన్ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటూ ప్రముఖ స్టార్గా రాణిస్తున్నారు. ఈయన ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మదరాసీ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం. కాగా తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రంలో నటిస్తున్నారు. నటుడు రవి మోహన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా క్రేజీ తార శ్రీలీల కధానాయకిగా కోలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాశ్ భాస్కర్ నిర్మిస్తున్న ఈ భారీ పిరియడికల్ కథా చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీంతో శివకార్తీకేయన్ తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు ప్రసారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిశారని, కార్తీక్ సుబ్బరాజ్ చెప్పిన స్టోరి లైన్ శివకార్తికేయన్కు నచ్చడంతో ఆయన నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉందరి సమాచారం. ఇదే ఈ ప్రచారం గనుక నిజమైతే మరో సూపర్హిట్ చిత్రానికి బీజం పడినట్లే అనే టాక్ కోలీవుడ్ వర్గాలో వినిపిస్తోంది.