
యూపీఎస్సీ టాపర్లకు ప్రోత్సాహం!
సాక్షి, చైన్నె: యూపీఎస్సీలో సత్తా చాటిన అభ్యర్థులకు ఢిల్లీ వెళ్లేందుకు అవసరమైన ఖర్చుల నిమిత్తం తలా రూ. 50 వేలు నగదు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వివరాలను బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో సీనియర్ మంత్రి దురై మురుగన్ మాట్లాడుతూ, ఆనమలై – పాండియారు నీటి పథకం గురించి కేరళతో చర్చించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే చర్చలకు ఆహ్వానించామని, త్వరలో ఈ చర్చలు జరుగుతాయన్నారు. మంత్రి కేఎన్ నెహ్రూ మాట్లాడుతూ సమయపురంలో తాగునీటి పథకం టెండర్ల పై దృష్టి పెట్టామన్నారు. మదురై చిత్తిరై ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కార్పొరేషన్ కమిషనర్ను ఆదేశించామన్నారు. మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ మాట్లాడుతూ గ్రౌండ్ ఫ్లోర్లో నివాస స్థలానికి మాత్రమే ఇంటి పట్టా అని, అవసరం అయితే, రెండు మూడు పోర్లకు విజ్ఞప్తి చేసుకుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమయంలో స్పీకర్ అప్పావు జోక్యం చేసుకుని పట్టా లేదు..పన్ను లేదంటూ చమత్కరించడంతో సభ్యులందరూ నవ్వుకున్నారు. అదే సమయంలో నీట్లో ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్ కోట అమలు విషయంలో ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సభలో గందరగోళం నెలకొంది. చివరకు రాష్ట్రంలో పాడి ఉత్పత్తి 54 లక్షల లీటర్లకు పెంపునకు చర్యలు విస్తృతం చేశామని మంత్రి రాజకన్నప్పన్ ప్రకటించారు. మంత్రి గీతా జీవన్ మాట్లాడుతూ, దివ్యాంగుల సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో అన్ని పరిష్కరించ బడుతాయన్నారు. అనంతరం సభలో వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపునకు సంబంధించిన పద్దును ఆ శాఖ మంత్రి మూర్తి, రవాణా శాఖకు సంబంధించిన పద్దును మంత్రి శివశంకర్ దాఖలు చేశారు.
యూపీఎస్సీ టాపర్లకు అభినందనలు..
ముందుగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రత్యేక ప్రసంగంతో యూపీఎస్సీ టాపర్లకు అభినందనలు తెలియజేశారు. నాన్ మొదల్వన్ పథకం నాలుగు సంవత్సరాలుగా విజయవంతంగా సాగడానికి ప్రతి ఫలం దక్కిందన్నారు. తమిళనాడులో 2016 వరకు ప్రభుత్వ ఉద్యోగాల పరంగా 100 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. 2021లో 27 మంది తమిళులు మాత్రమే కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని గుర్తుచేశారు. 2023లో నాన్ మొదల్వన్ పథకం అమల్లోకి వచ్చినానంతరం ప్రతి సంవత్సరం యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య రాష్ట్రంలో పెరిగిందన్నారు. మెయిన్స్కు సిద్ధమయ్యే వారికి రూ. 7500 అందిస్తూ వచ్చామన్నారు. 2023–2024లో 47 మంది తమిళనాడు అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారన్నారు. ఈ సంవత్సరం తమిళనాడు నుంచి 57 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 50 మంది నాన్ మొదల్వన్ పథకం ద్వారా ప్రోత్సహించిన వారేనని అన్నారు. సోదరుడు శివచంద్రన్ జాతీయ స్థాయిలో 23వ స్థానంలో, సోదరి మోనికా 39వ స్థానంలో నిలబడి తమిళనాడు ఖ్యాతిని ఎలుగెత్తి చాటారన్నారు. ప్రిలిమ్స్ , మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూల నిమిత్తం ఢిల్లీ వెళ్లాల్సి ఉందని గుర్తుచేశారు. వీరికి శిక్షణ, ప్రయాణ ఖర్చులకు గాను ఒకొక్కరికి రూ. 50 వేలు అందించనున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన వారిందరికి అసెంబ్లీ వేదికగా అభినందనలు, ప్రశంసలు తెలియజేశారు.
ఖర్చులకు ఒక్కొక్కరికి రూ. 50 వేలు
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం వెల్లడి