భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని డీఫాల్ట్ రైస్ మిల్లర్లపై ప్రభుత్వం విధించిన 25 శాతం పెనాల్టీతో పాటు 12 శాతం వడ్డీని ఎత్తివేయాలని రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొండమీది గోవింద రావు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో జిల్లాలోని కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్ తగిన సమయంలో ఇవ్వలేక పోయారన్నారు. దాంతో అధికారులు వారిని డీఫాల్ట్ లిస్టులో ఉంచడంతో పాటు కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల బెదిరింపులకు భయపడి ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన మిల్లర్ తణుకు సురేష్ భార్య స్వప్న ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా మిల్లర్ వ్యవస్థ ఉందన్నారు. ప్రభుత్వం మరోసారి పెనాల్టీని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. 12 ఏళ్లుగా మిల్లర్లకు ఇవ్వాల్సిన కస్టోడియన్ చార్జీలు, డ్రైయేజ్, మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్, ఎఫ్ఆర్కే మిక్సింగ్ చార్జీలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన బకాయిలను పెనాల్టీతో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు అనూప్ రెడ్డి, శంకర్రావు, సైదులు, రంగిశెట్టి నరసింహా రావు, శంకర్, కె.రాజేష్ పాల్గొన్నారు.


