
రేపు ప్రజావాణి రద్దు
భానుపురి (సూర్యాపేట) : తిరుమలగిరిలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ ఉన్నందున అదేరోజు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ప్రకటనలో తెలిపారు. అధికారులు అందరూ సీఎం పర్యటనలో పాల్గొనాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజావాణి కోసం కలెక్టరేట్కు రావొద్దని సూచించారు.
నాఫ్స్కాబ్ అసోసియేట్ మెంబర్గా శ్రీనివాస్రెడ్డి
నల్లగొండ అగ్రికల్చర్ : నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్(నాఫ్స్కాబ్) అసోసియేట్ మెంబర్గా నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం నాఫ్స్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ భీమా సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీబీని ప్రగతిపథంలో నడిపించేలా చైర్మన్ శ్రీనివాస్రెడ్డి చేసిన కృషికి తెలంగాణ నుంచి ఆయనకు నాఫ్స్కాబ్లో ప్రాతినిధ్యం కల్పించారు. ఇక నుంచి కోఆపరేటివ్ బ్యాంకులు రైతుల కోసం తీసుకునే నిర్ణయాలలో శ్రీనివాస్రెడ్డి కీలక భూమికను పోషించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సహకార బ్యాంకుల బలోపేతానికి తన వంతు కృషిచేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అమానుష యుద్ధాలు ఆపాలి
సూర్యాపేట : ‘పాలస్తీనాపై అమెరికా వత్తాసుతో ఇజ్రాయిల్ అమానుషమైన యుద్ధం చేస్తూ ఆ దేశ పౌరుల జీవించే హక్కును కాలరాస్తోంది.. దీనిని ఆపాలి’ అని మాసపత్రిక సంపాదకుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ లక్ష్మీగార్డెన్స్లో వివేక్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన స్మారకోపన్యాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మధ్య భారతంలో అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పజెప్పడం కోసం ఆదివాసుల హననం సాగుతోందని, దీన్ని ఆపడానికి ప్రజా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్, కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా బిర్సాముండా, కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజుల నుంచి నేటి దాకా ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారన్నారు.
రేపు సూర్యాపేటకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక
కోదాడరూరల్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రాంచందర్రావు ఈ నెల14 సూర్యాపేట జిల్లాకు రానున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటే శ్వరరావు తెలిపారు. శనివారం కోదాడలో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడారు. సోమవారం సాయంత్రం మూడు గంటలకు సూర్యాపేటలో పార్టీ నాయకుల సమావేశంలో రాంచందర్రావు పాల్గొంటారని ఆ తర్వాత సొంతూరు కోదాడ మండలం నల్లబండగూడెంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలతో పాటు అభినందన సభకు హాజరవుతారని వివరించారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి మంగళవారం పార్టీ నేతల సమావేశంలో ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రబారి రాజమౌళి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతరెడ్డి, బొబ్బా భాగ్యారెడ్డి, కనగాల నారాయణ, కనగాల వెంకట్రామయ్య, నూనె సులోచన, రాంచద్రయ్య, యశ్వంత్, హనుమంతరావు, కిట్టు, జనార్దన్ పాల్గొన్నారు.

రేపు ప్రజావాణి రద్దు

రేపు ప్రజావాణి రద్దు