
సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు
నల్లగొండ: జిల్లాలో 32 సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు ఉండగా 30 అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని, వాటికి స్థలాలు సేకరిస్తే నిధులు మంజూరు చేసి పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన ఉమ్మడి జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల వారీగా అధికారులు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లు, పాఠశాలలకు స్థలాన్ని సేకరించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కుల వృత్తిని కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉమ్మడి జిల్లాకు మరో 10 వేల రక్షణ కిట్లు అందిస్తామన్నారు. జిల్లాకు 77 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసి ప్రారంభించామన్నారు. ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలు నిర్మించాలని, తద్వారా అద్దె భారం తగ్గుతుందన్నారు. సాగర్ ఎమ్మెల్యే జైవీర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం, ఎమ్మెల్సీ శంకర్నాయక్ మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు గీత కార్మికులకు కాటమయ్య కిట్లను అందజేశారు. అంతకు ముందు కలెక్టరేట్ ప్రాంగణంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. సమావేశంలో నల్లగొండ , యాదాద్రి జిల్లాల కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రవాణా శాఖ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ స్థలాలు సేకరిస్తే నిధులు
మంజూరు చేస్తాం
ఫ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ
మంత్రి పొన్నం ప్రభాకర్
ఫ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష
ఫ హాజరైన మంత్రి కోమటిరెడ్డి,
గుత్తా, ఎంపీ, ఎమ్మెల్యేలు
రోడ్డు ప్రమాదాలను నివారించాలి : గుత్తా సుఖేందర్రెడ్డి
డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే సమయంలోనే కఠిన నిబంధనలు అమలు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిచేయాలని శాసన మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురంలో వాహనాల ఫిట్నెస్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు.
బస్సుల సంఖ్య పెంచాలి : మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ, మిర్యాలగూడ, నార్కట్పల్లి బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. బీసీ సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించే విషయంపై దృష్టి సారించాలన్నారు.