
ఏఓ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
మఠంపల్లి: మఠంపల్లిలోని మండల వ్యవసాయ కార్యాలయం సోమవారం మధ్యాహ్నం 12గంటల వరకు తెరుచుకోలేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. రైతు భరోసా, పట్టాదారు పాస్బుక్ వివరాల నమోదు, ఎరువులు, విత్తనాల స్లిప్పుల కోసం వ్యవసాయ కార్యాలయానికి వస్తే అధికారులు అందుబాటులో ఉండడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోందని గ్రహించిన ఏఈఓలు శ్రావ్యాంజలి,త్రివేణిలు అక్కడికి చేరుకుని ఆటోలో వస్తుండగా తమ వద్ద ఉన్న తాళంచెవిపోయిందని తెలిపారు. దీంతో తాము ఉదయం నుంచి కార్యాలయం బయటనే ఉన్నామని చెప్పారు. మధ్యాహ్నం వరకు కూడా కార్యాలయం తెరవడానికి ఎందుకు ప్రయత్నించలేదని రైతులు ఆగ్రహించారు. దీంతో ఏఈఓలు.. రైతుల సహకారంతో కార్యాలయం తాళాన్ని దగ్గరుండి పగులగొట్టించారు. అనంతరం కార్యాయంలో విధులు నిర్వహించారు. ఇంతజరిగినా కార్యాలయం వైపునకు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రాలేదు. కానీ రైతులు తమకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పీఏసీఎస్ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని, రైతులు సబ్సిడీపై కొనుగోలుచేసుకోవాలన్న సమాచారాన్ని వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. వ్యవసాయ సీజన్లో అందుబాటులో ఉండాల్సిన అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు తెరుచుకోని మఠంపల్లి మండల వ్యవసాయ అధికారి కార్యాలయం
అధికారుల తీరుపై కర్షకుల ఆగ్రహం
ఆటోలో తాళంచెవి పోవడంతో
తెరువలేకపోయామన్న ఏఈఓలు
రైతుల సహకారంతో కార్యాలయ తాళం పగులగొట్టి విధులకు..

ఏఓ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా