
పక్కాగా ఎకో క్లబ్లు
విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ నిర్ణయం
సూర్యాపేటటౌన్ : పచ్చదనం పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా మొక్కల ప్రాధాన్యంతోపాటు వివిధ అంశాలపై విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. పర్యావరణ సంబంధిత కార్యకలాపాల నిర్వహణలో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం ఎకో క్లబ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్లబ్లను ఈ విద్యాసంవత్సరం నుంచి ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’గా పిలవనున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొత్త క్లబ్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఇవి ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో ఈ సంవత్సరం పకడ్బందీగా నిర్వహించేలా జిల్లా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.
వచ్చే నెలాఖరులోగా..
వచ్చేనెల 29 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి ఈ ప్రకియ మొదలుపెట్టారు. ప్రతి తరగతి నుంచి చురుగ్గా ఉన్న నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి టీచర్లను, పాఠశాల కమిటీ చైర్మన్ను క్లబ్లో భాగస్వాములు చేయనున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయులు ఇందులో సభ్యులుగా ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏడు అంశాలకు సంబంధించిన యాక్టివిటీ ఫొటోలు, వీడియోలు తీసి ప్రత్యేక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.
ప్రతి స్కూల్ నుంచి ఒక కమిటీ
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 950, మోడల్ స్కూల్స్ తొమ్మిది, కేజీబీవీలు 19, నాలుగు మినీ గురుకులాలు, ఎనిమిది రెసిడెన్షియల్స్ స్కూల్స్, 398 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో లక్ష మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ప్రతి పాఠశాల నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ ప్రజా ఉద్యమంగా చేపట్టిన ఏడు అంశాల్లో ఎకో క్లబ్లను భాగస్వామ్యం చేస్తారు.
ఏడు అంశాలు ఇవే..
ఇంధన పొదుపు
నీటి పొదుపు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు
సుస్థిర ఆహార వ్యవస్థ
వృథాను అరికట్టడం
ఆరోగ్యకరమైన జీవన
విధానాన్ని అలవర్చుకోవడం
వ్యర్థాల రీసైక్లింగ్
ఫ గతేడాది ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో ఈసారి పక్కాగా
చేపట్టేందుకు కార్యాచరణ
ఫ జూలై 29లోపు కమిటీలు
వేయాలని ఆదేశం
ఫ ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్
పేరుతో ఏడు
అంశాలపై ప్రచారం
ఫ ప్రతి పాఠశాల నుంచి
ఒక కమిటీ ఏర్పాటు
అన్ని స్కూళ్లలో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలి
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఎకో క్లబ్లు ఎంతో ఉపయోగపడతాయి. అన్ని స్కూళ్లలో క్లబ్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశాం. కేటాయించిన అంశాల వారీగా ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించాలి. రోజూ నిర్వహించే కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను ప్రత్యేక పోర్టల్లో అప్లోడ్ చేయాలి.
– దేవరశెట్టి జనార్దన్,
జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్
పాఠశాలల వివరాలు
ప్రభుత్వ పాఠశాలలు 950
మోడల్ స్కూల్స్ 9
కేజీబీవీలు 19
మినీ గురుకులాలు 4
రెసిడెన్షియల్స్ స్కూల్స్ 8
ప్రైవేట్ పాఠశాలలు 398
విద్యార్థుల సంఖ్య : లక్ష మందికిపైగా