ముఖం చూపిస్తేనే సరుకులు | - | Sakshi
Sakshi News home page

ముఖం చూపిస్తేనే సరుకులు

Jun 23 2025 6:18 AM | Updated on Jun 23 2025 6:18 AM

ముఖం

ముఖం చూపిస్తేనే సరుకులు

నాగారం : అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు పారదర్శకంగా సరుకులు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌ ) తీసుకొచ్చింది. సరుకులు పక్కదారి పట్టకుండా ముఖ గుర్తింపుతోనే అందజేస్తారు. గతంలో అంగన్‌వాడీ లబ్ధిదారులకు అందించే సరుకుల విషయంలో జాబితాలో పేర్లు ఒకరివి ఉంటే.. మరొకరికి సరుకులు ఇస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ పద్ధతికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలో ఈ విధానం అమలుకు ఐసీడీఎస్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూలై–1 నుంచి అంగన్‌వాడీ టీచర్లకు గతంలో అందజేసిన ఫోన్లలో పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌ ద్వారా ఈ ముఖ గుర్తింపు విధానాన్ని అమలు చేయనున్నారు. దీనికి అనుగుణంగా యాప్‌ను అప్‌డేట్‌ చేశారు.

మూడేళ్లలోపు చిన్నారులకు..

ప్రస్తుతం ముఖ గుర్తింపు విధానం 6 నెలల వయసు నుంచి 3ఏళ్ల లోపు చిన్నారులకు పంపిణీ చేసే అదనపు ఆహారమైన బాలామృతం, గుడ్లు పంపిణీకి మాత్రమే వర్తిస్తుంది. పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లో చిన్నారి లేదా తల్లి ఫొటో తీస్తారు. ఆధార్‌ కార్డులో ఉన్న వివరాలను పొందుపరుస్తారు. అలాగే 3ఏళ్లు దాటిన చిన్నారులకు ఇంటికి ఇచ్చే పోషకాహారాన్ని తల్లి ఫొటోను యాప్‌లో నమోదు చేసి పంపిణీ చేస్తారు. దీంతో పోషకాహారం పంపిణీ ఏమేర జరుగుతోందో అనే దానిపై జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల పర్యవేక్షణ సులువు కానుంది. కాగా జిల్లాలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా పోషణ్‌ ట్రాకర్‌ ద్వారా యాప్‌లో నమోదు చేస్తున్నారు. కాగా జూలై 1 నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. ప్రస్తుతానికి నమోదు ఒక్కటే అయినప్పటికీ రానురాను ముఖగుర్తింపును విస్తరింపజేయనున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే ఆహారానికి కూడా ముఖ గుర్తింపు తప్పనిసరి చేయనున్నారు.

ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో..

జిల్లాలోని 5 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,209 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు కలిపి54,683 మంది నమోదై ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. సరుకులు అసలైన లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ముఖ గుర్తింపు హాజరును ప్రవేశపెట్టారు.

ఫ అంగన్‌వాడీల్లో ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టం

ఫ జూలై 1 నుంచి అమలుకు సన్నాహాలు

ఫ సరుకులు పక్కదారి పట్టకుండా

కొత్త విధానం

పారదర్శకత కోసమే..

అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్‌తో లబ్ధిదారులకు పారదర్శంగా సరుకులు అందుతాయి. ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టం ద్వారా 6నెలల నుంచి 3ఏళ్లలోపు చిన్నారులకు అందిస్తున్న టేక్‌ హోమ్‌ రేషన్‌ను నిర్ధారణ పూర్వకంగా లబ్ధిదారులకు అందుతుంది. వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు అందజేసే సరుకులను ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేస్తారు.

– నర్సింహారావు, జిల్లా సంక్షేమ అధికారి, సూర్యాపేట.

జిల్లాలో ఇలా...

ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు 05

అంగన్‌వాడీ కేంద్రాలు 1,209

చిన్నారుల సంఖ్య 45,177

గర్భిణులు 5,220

బాలింతలు 4,286

ముఖం చూపిస్తేనే సరుకులు1
1/1

ముఖం చూపిస్తేనే సరుకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement