
రూ.327.39 కోట్ల రైతు భరోసా నిధులు జమ
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,91,292 మంది రైతులకుగాను 2,76,787 మంది రైతుల ఖాతాల్లో రూ. 327.39 కోట్లు నిధులు జమయ్యాయి. ఈమేరకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉద్యోగుల నూతన వేతన సవరణ నివేదిక ప్రకటించాలి
సూర్యాపేటటౌన్ : రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ నివేదికను వెంటనే ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సోమయ్య అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల కాలం పూర్తయినా ఇంతవరకు పీఆర్సీ రిపోర్టు ప్రభుత్వం విడుదల చేయలేదని, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. వేతన సవరణ రిపోర్టును ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మనఊరు –మనబడి పథకంలో మంజూరై మధ్యలో నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, పెండింగ్లో ఉన్న సప్లమెంటరీ బిల్లులను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, శ్రీనివాసరెడ్డి, అరుణ భారతి, వెంకటయ్య, నాగేశ్వరరావు, ఆడం, వెలుగు రమేష్, సోమయ్య, చిలక రమేష్, లాలు, పాండురంగా చారి, బాల సైదిరెడ్డి, సాంబయ్య, శ్రీనివాసచారి పాల్గొన్నారు.
గిరిజనులను అన్ని
రంగాల్లో చైతన్యం చేస్తాం
సూర్యాపేట : ఆదివాసీలు, గిరిజనులను అన్ని రంగాల్లో చైతన్య చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్యనాయక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఐదుగురు చొప్పున ఎంపిక చేసిన ఆదివాసీ, గిరిజనుల కాంగ్రెస్ ప్రతినిధులకు శిక్షణ తరగతులు ఈ నెల 24, 25, 26వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీల చైతన్యం కోసం రాజకీయ శిక్షణా తరగతులు నిర్వ హించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఏఐసీసీ జాతీయ నేత రాహుల్గాంధీ పిలుపు మేరకు దేశంలో గిరిజన, ఆదివాసీల అభివృద్ధికి వారం రోజుల పాటు ట్రైనర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. శిక్షణ తరగతుల ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రూ.327.39 కోట్ల రైతు భరోసా నిధులు జమ