
పార్కింగ్ చేసిన కార్లలో పిల్లలు ఎక్కకుండా చూడాలి
సూర్యాపేటటౌన్ : పార్కింగ్ చేసిన కార్లలో పిల్లలు ఎక్కకుండా తల్లిదండ్రులు చూడాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. వేసవి కాలంలో పార్క్ చేసిన వాహనాల్లోకి అనుకోకుండా వెళ్లిన పిల్లలు తీవ్రమైన వేడిమి వల్ల ఊపిరాడక మృతి చెందుతున్న సంఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పోలీసుల సూచనలు..
● వాహనాన్ని లాక్ చేయకముందు లోపల ఎవరైనా ఉన్నారా అని చెక్ చేసుకోవాలి. ముందు, వెనుక సీట్లను పరిశీలించాలి.
● పార్క్ చేసే వాహనంలో, లేదా వాహనం చుట్టుపక్కల పిల్లలను ఒంటరిగా వదిలివెళ్లకూడదు.
● వాహన తాళాలు పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. అనుకోకుండా వాహనంలోకి వెళ్లి చిక్కుకుపోయే ప్రమాదం ఉంది.
● వాహనాలు ఆడుకునే ప్రదేశాలు కాదని, ఒంటరిగా వాటిలోకి ప్రవేశించరాదని పిల్లలకు తెలియజేయాలి.
● ‘చైల్డ్ డిటెక్షన్ అలర్ట్’ వంటి భద్రతా పరికరాలను వాహనాల్లో అమర్చండి.
● వాహనాల విండోలకు బ్లాక్ ఫిల్ములు లేదా అధిక టింటింగ్ ఉపయోగించరాదు.
● వాహనంవాడకంలో లేనప్పటికీ డోర్లు, విండోలు పూర్తిగా మూసి లాక్ చేయాలి.
ఫ జిల్లా ఎస్పీ కె.నరసింహ