
గోదావరి జలాలు విడుదల
అర్వపల్లి: వరి పొలాలు ఎండిపోతుండడంతో రైతుల విన్నపం మేరకు నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం జనగామ జిల్లా బయ్యన్నవాగు నుంచి జిల్లాకు వెయ్యి క్యూసెక్కుల గోదావరి జలాలను విడుదల చేశారు. అయితే ఈ యాసంగి సీజన్కుగాను షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే ఆరు విడుతలుగా నీటిని వదిలారు. షెడ్యూల్ పూర్తికావడంతో గత నెల 24న జిల్లాకు నీటిని నిలిపివేశారు. దీంతో నీరు సాలక వరిచేలు ఎండిపోతున్నాయి. మరో పది రోజుల్లో వరి పంటలు చేతికందుతాయని, మరో విడత నీరు అందించాలని అధికారులకు రైతులు విన్నవించడంతో నీటిని వదిలారు. వదిలిన వెయ్యి క్యూసెక్కుల నీటిలో 69 డీబీఎంకు 300, 70డీబీఎంకు 50, 71డీబీఎంకు 630 క్యూసెక్కుల చొప్పున నీటిని ఇస్తున్నారు. రైతులు ఈ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని నీటిపారుదల శాఖ డీఈఈ ఎం.సత్యనారాయణ కోరారు.