శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పేద విద్యార్థులను కించపరిచేవిధంగా మాట్లాడిన గరికపాటి నరసింహారావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని, రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ సెంటర్ల ఏర్పాటును విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మిలు డిమాండ్ చేశారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో గరికపాటి వ్యాఖ్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్మార్ట్ కిచెన్ల వల్ల వంట కార్మికులు ఉపాధి కోల్పోతారని, మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బాలలపై అసభ్యంగా మాట్లాడిన గరికపాటిపై ప్రభుత్వం, బాలల హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుశీల, బి.ఉత్తర, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డి.చందు, ఖగేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ, ఐద్వా నాయకురాలు టి.ప్రవీణ, యూనియన్ నాయకులు ఎ.రాధ, వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


