
అచ్చెన్నా..మీకిది తగునా!
నందిగాం: మండల పరిధిలోని కణితూరు శ్మశాన వాటికకు విద్యుత్ సరఫరా కోసం పంచాయతీ తీర్మాణం చేసి డబ్బులు చెల్లించినా కనెక్షన్ మంజూరు చేయకుండా విద్యుత్శాఖ అధికారులు తాత్సారం చేస్తున్నారని సర్పంచ్ పేరాడ విమల, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉన్న మంచినీటి కోనేరు పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ నుంచి శ్మశాన వాటికకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు అంచనాలు తయారు చేయాలని ఆ శాఖ ఏఈని కోరేందుకు ఈ ఏడాది జనవరి 7న పంచాయతీ తీర్మానం చేశారు. ఫిబ్రవరి 27న నందిగాం కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అందుకు అనుగుణంగా విద్యుత్ శాఖ వారు తయారు చేసిన అంచనాల మేరకు స్తంభాలు, లైన్ కోసం ఏప్రిల్ 29న రూ.1,26,273 సంస్థకు చెల్లించారు. అనంతరం విద్యుత్ సిబ్బంది శ్మశాన వాటిక వరకు స్తంభాలు తీసుకువచ్చి రెండింటిని పాతిపెట్టారు. తర్వాత ఏం జరిగిందో గానీ మిగిలిన వాటిని అలాగే వదిలేశారు. నెలలు గడుస్తున్నా మిగతావాటిని పాతకుండా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దీనికి కారణం రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు విద్యుత్ శాఖ అధికారులపై లొత్తిడి చేసి పని జరగకుండా అడ్డుకోవడమేనని సర్పంచ్, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాల అభివృద్దికి కట్టుబడి ఉంటానని చెప్పే మంత్రి.. ప్రతిపక్ష పార్టీ బలంగా ఉన్న పంచాయతీల్లో అభివృద్ధి జరగకుండా, అధికారులపై ఒత్తిడి చేసి పనులు జరగకుండా అడ్డుకోవడం తగదని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు కూడా గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనలో ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజలకు సేవలు అందించాలని కోరుతున్నారు.
ఇక్కడా రాజకీయమేనా..
గ్రామ పరిధిలోని శ్మశాన వాటికకు విద్యుత్ సదుపాయం కల్పించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి అనుకూలమైన గ్రామమనే కక్షతోనే మంత్రి అచ్చెన్నాయుడు శ్మశానవాటిక వద్ద కూడా రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి విద్యుత్ పనులు పూర్తి చేయాలి.
– పేరాడ రమేష్, కణితూరు
కణితూరులో శ్మశానవాటికకు విద్యుత్ సరఫరా చేయని అధికారులు
రాజకీయ కక్షలో భాగమేనంటున్న సర్పంచ్, గ్రామస్తులు

అచ్చెన్నా..మీకిది తగునా!

అచ్చెన్నా..మీకిది తగునా!

అచ్చెన్నా..మీకిది తగునా!