
ఉపాధ్యాయులే ఉద్యమ, సాహిత్య నిర్మాతలు
శ్రీకాకుళం కల్చరల్ : ఇటు ఉద్యమాలైనా, అటు సాహిత్య ప్రక్రియలైనా సమర్థంగా నిర్వహించగల సత్తా ఉపాధ్యాయులకు ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో ఆదివారం ఏపీటీఎఫ్ అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్ అధ్యక్షతన పుస్తకావిష్కరణ, పుస్తక పరిచయ సభ నిర్వహించారు. కంచరాన భుజంగరావు రచించిన ‘గీసి చెరిపే బొమ్మ’ పుస్తకాలను ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పుస్తక రూపంలో ప్రచురించారు. ఏపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి సీహెచ్ ప్రభాకరరావు సతీమణి చిగురుపల్లి చంద్రకళ వర్ధంతి సందర్భంగా రచయిత గంట్యాడ గౌరునాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవి తన ఆలోచనలను మెరుగుపరుచుకుంటూ చేసిన రచనకు ఈ పుస్తకం ప్రతీక అని పేర్కొన్నారు. డాక్టర్ సుంకరి గోపాలయ్య పుస్తకాన్ని పరిచయం చేస్తూ కొన్ని కవితలను చదివి వినిపించారు. కవి కంచరాన భుజంగరావు మాట్లాడుతూ తాను సాహిత్యం రాయడానికి గురువులే కారణమని చెప్పారు. అనంతరం దివికుమార్ రచించిన ‘ఉరికంబం సాక్షిగా’ పుస్తకాన్ని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి పరిచయం చేశారు. భగత్సింగ్ జీవితాన్ని ఈ పుస్తకం మనముందు ఆవిష్కరిస్తుందన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ తిరుమల చైతన్య మాట్లాడుతూ శబ్దం అర్థం కలిస్తే సాహిత్యం అవుతుందని, ఉపాధ్యాయుడు బోధనలో తాత్వికుడుగా ఎదగాలని, వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సాహిత్యం అవసరమని చెప్పారు. జనసాహితీ రాష్ట్ర అధ్యక్షుడు, రచయిత దివికుమార్ మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ఈ పుస్తకంలో పూర్తి సాక్ష్యాలతో జీవితాన్ని, తాత్వికతను పరిచయం చేశానని చెప్పారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి.అనిల్కుమార్, రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వతి, జనసాహితీ జిల్లా కార్యదర్శి పి.మోహనరావు, చావలి శ్రీనివాస్, సదాశివుని శంకరరావు, సీహెచ్ రామచంద్రరావు, కె.గోవిందరావు, పి.లక్ష్మణరావు, రౌతు గణపతిరావునాయుడు, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పుస్తకావిష్కరణ సభలో వక్తలు