
న్యాయం కోసం మృతదేహంతో బైఠాయింపు
నందిగాం/వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటు సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరికాన చైతన్య అనే యువకుడు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో కొండవూరు గ్రామస్తులు ఆదివారం నిరసనకు దిగారు. యువకుడి మృతదేహంతో నందిగాం మండలం కవిటిఅగ్రహరం రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రమాదానికి కారణమైన కవిటి అగ్రహారం ట్రాక్టర్ డ్రైవర్ పిట్ట మహేష్ సాయం కోసం వేడుకుంటున్న క్షతగాత్రున్ని అక్కడే విడిచి పట్టి మానవత్వం లేకుండా వెళ్లిపోయాడని, విషయం తెలుసుకున్న ట్రాక్టర్ యజమాని పిట్ట అర్జున్ ట్రాక్టర్ను నీటితో కడిగి ప్రమాద ఆనవాళ్లు లేకుండా దాచారని మండిపడ్డారు. న్యాయం చేస్తానని చెప్పి కనిపించకుండాపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల నిరసన నేపథ్యంలో కవిటి అగ్రహారం వద్ద పూండి –పలాస రోడ్డుపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతి, నందిగాం ఎస్సై షేక్ మహహ్మద్ ఆలీ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే యజమాని అర్జున్ వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం, కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు వచ్చి బాధితులతో మాట్లాడి ట్రాక్టర్ డ్రైవర్తో పాటు, ఓనర్పై కూడా కేసు నమోదు చేస్తామని, మృతుని తమ్ముడు హరీష్కు న్యాయం చేస్తామని తెలపడంతో శాంతించారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు
మానవత్వం చూపని ట్రాక్టర్ డ్రైవర్, ఓనర్
రోడ్డుపై ఆందోళనకు దిగిన గ్రామస్తులు

న్యాయం కోసం మృతదేహంతో బైఠాయింపు