
చెల్లని సిఫార్సులు
కూటమి నేతలకు శృంగభంగం!
పోలీస్
బదిలీల్లో
● సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వలేదని నాయకుల్లో ఆవేదన
● 220 మంది బదిలీల్లో చెప్పిన వారికి జరగలేదని ఆక్రోశం
● కీలక నేత దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం
● ఓ అధికారిని పిలిచి క్లాస్ పీకినట్టు ప్రచారం
● బదిలీలపై నెలకొన్న అనుమానాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
పోలీసుల బదిలీల్లో నేతల పప్పులుడకలేదు. వారి మాట చెల్లలేదు. ఒక్కో నేత తమ లెటర్ హెడ్ ద్వారా పోస్టింగ్ల కోసం రికమెండ్ చేశారు. ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలనేది నాయకులే డిసైడ్ చేశారు. లిఖిత పూర్వకంగా అధికారులకు రాసి పంపించారు. కానీ వారు సూచించిన విధంగా బదిలీలు జరగలేదు. వారి సిఫార్సులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో పరువు పోయిందని నేతలంతా లబోదిబోమంటున్నారు. చివరికి కానిస్టేబుళ్లకు కూడా పోస్టింగ్ ఇప్పించలేకపోయామని ఆవేదన చెందుతున్నారు. అవమానకరమని జిల్లా కీలక నేత దృష్టికి ఆ నాయకులంతా తీసుకెళ్లారు. సంబంధిత అధికారిని ఒకరిని పిలుపించుకుని ఆ కీలక నేత క్లాస్ పీకినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల చేసిన బదిలీలు అమల్లోకి వస్తాయా? మళ్లీ ఏమైనా మారుతాయా? అన్న దానిపై సందేహం నెలకొంది.
ఈ పదవులెందుకంటూ ఆవేదన...
పోలీసుల బదిలీలపై నేతలు గుర్రుగా ఉన్నారు. సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఇటీవల 220 మందికి బదిలీలు జరిగాయి. 19 మంది ఏఎస్ఐలకు, 53 మంది హెడ్ కానిస్టేబుళ్లకు, 148 మంది కానిస్టేబుళ్లను బదిలీలు చేశారు. ఈ ప్రక్రియకు ముందు ఆ పోలీసుల్లో చాలా మంది నేతల సిఫార్సు లేఖలు తీసుకున్నారు. కావాల్సిన పోస్టింగ్ కోసం నాయకుల ద్వారా రికమెండ్ చేయించుకున్నారు. సిఫార్సుల కోసం పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల అవసరాన్ని నాయకులు క్యాష్ చేసుకున్నట్టు తెలిసింది. దీంతో ఒక్కసారిగా సిఫార్సుల తాకిడి ఎక్కువైంది. ఆ లేఖలు వచ్చి పడటంతో అధికారులు సైతం ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. కోరుకున్న ప్లేస్ ఇవ్వాలంటే కష్టమన్న అభిప్రాయానికి వచ్చేసి ఉన్నతాధికారుల సూచనల మేరకు బదిలీ కసరత్తు పూర్తి చేసినట్టు తెలిసింది. సిఫార్సులకు పెద్ద పీట వేయకుండా పరిస్థితులకు తగ్గట్టుగా, పనితీరు ఆధారంగా బదిలీలు చేసినట్టు సమాచారం. ఇది నాయకులకు రుచించ లేదు. పోలీసు అధికారులపై మండిపడిపోతున్నారు. కానిస్టేబుళ్ల పోస్టింగ్లు కూడా వేయించుకోలేకపోతే ఇంకెందుకు పదవులని ఆవేదనకు లోనైనట్టు తెలిసింది.
గట్టిగా క్లాస్ పీకారా..?
సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ఏకపక్షంగా బదిలీలు చేశారని, రాజకీయ నాయకులకు విలువ లేకపోతే ఎలా అని సదరు నాయకులంతా జిల్లా కీలక నేత దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించారు. అంతేకాకుండా ప్రస్తుతం పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ సామాజిక వర్గ క్షేత్ర స్థాయి అధికారులు కూడా నాయకులకు మద్దతుగా కీలక నేతకు బ్రీఫ్ చేసినట్టు తెలిసింది. ఎవరు చెప్పినా జరగలేదని, కనీసం పట్టించుకోలేదని కీలక నేతకు నూరిపోసినట్టు సమాచారం. సమాచారమంతా తెలుసుకుని సదరు కీలక నేత రియాక్ట్ అయ్యారు. గురువారం రాత్రి ఒక పోలీసు అధికారిని పిలిపించుకుని ఇలా అయితే ఎలా అని కాస్త గట్టిగా క్లాస్ పీకినట్టు చర్చ జరుగుతోంది. ఆ సమయంలో సదరు అధికారి ఏదో చెప్పడానికి ప్రయత్నించినా వినలేదని తెలిసింది. నాయకులు చెప్పింది చేయాల్సిందే అని హుకుం జారీ చేసినట్టు తెలియవచ్చింది. దీంతో ఇటీవల జరిగిన బదిలీలపై సందేహాలు కమ్ముకున్నాయి. ఆ నేత ఆదేశాల మేరకు బదిలీలపై పునరాలోచన చేస్తారేమో అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. అంతేకాదు నాయకులు చెప్పినట్టు జరగకపోవడంతో ఆ అధికారిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.