
పలాసలో కార్మిక హక్కులకు భంగం
కాశీబుగ్గ: తమ సమస్యల పరిష్కారం కోసం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద పలాస–కాశీబుగ్గ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న నిరసనను శుక్రవారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. నిరసన, ర్యాలీ చేసేందుకు వీలు లేదని పో లీసులు చెప్పడంతో పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెయ్యిల గణపతి, యూనియన్ నాయకులు సీహెచ్ మురగన్, కె.వెంకట్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని పోలీస్ నిబంధనలు పలాసలోనే అమలు చేస్తూ ప్రజల హక్కులను పోలీసులు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు పోలీసులను పంపించి నిరసన జరగనివ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బి.కూర్మారావు, ఎం.రవి, పి.బాలకృష్ణ, కె.ఈశ్వరరావు, ఎస్.తిరుపతి, ఢిల్లీ, ప్రకాష్ ముఖి, ఎస్.శంకర్, ఎస్.లక్ష్మి, ఉషా, గులాబీ, ఎస్.రమేష్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.