
పట్టాలపై మృత్యు ఘంటిక
కాశీబుగ్గ :
కుటుంబమంతా పెళ్లి సందడిలో ఉన్న వేళ వరుడి చావు కబురు శోకం నింపింది. ఆగస్టులో వివాహం జరగాల్సిన యువకుడిని పట్టాలపై మృత్యువు మింగేసింది. కుటుంబ సభ్యులు, పలాస జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి మండలం అక్కవ రం గ్రామానికి చెందిన బందాపు హరికృష్ణ(26) నౌపడ రైల్వేస్టేషన్ వద్ద రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. ఇతడు రైల్వేలో కాంట్రాక్ట్ కార్మి కుడిగా పనిచేస్తున్నాడు.
విశాఖపట్నం నుంచి పలాసకు తరచూ రాకపోకలు సాగిస్తుంటాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి సూపర్ఫాస్ట్ రైలు ఎక్కి పలాస బయలుదేరాడు. నౌపడ రైల్వేస్టేషన్ వద్ద హాల్ట్ లేకపోవడంతో బండి నెమ్మదిగా కదులుతున్న వేళ దిగి పోదామని ప్రయత్నించి మరోవైపు ఉన్న పట్టాలపై గెంతాడు. కానీ ప్రమాదవశాత్తు జారిపోవడంతో కాలు రైలు కిందకు వెళ్లిపోయి తెగిపోయింది. అర్ధరాత్రి వేళ అతడు బాధతో విలవిలాడిపోయాడు. నీరు కావాలని గట్టిగా కేకలు వేసి నా నిర్మానుష్య ప్రదేశం కావడంతో ఎవరూ అతడిని గుర్తించలేదు. దీంతో అతడు తనకు కాబోయే భార్యకు ఫోన్లో సమాచారం అందించడంతో.. కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు నొప్పితో విలవిలలాడిన హరికృష్ణ అక్కడే ప్రాణాలు వదిలేశాడు.
పలాస జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ యువకుడు ఇలా రైలు ఆపని వేళ బలవంతంగా దిగిపోవడం మొదటిసారి కాదని, ఇదివరకు కూడా ఇలా చేయగా హెచ్చరించామని స్థానిక రైల్వే సిబ్బంది చెబుతున్నారు. అందుకే రైలు నుంచి ఫ్లాట్ ఫాం వైపు దిగకుండా వెనుక వైపు దిగాడని, కానీ ఆ పట్టాలపై గూడ్సు రైలు ఉండడంతో అనుకోని రీతిలో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మృతుడు హరికృష్ణ తండ్రి లచ్చయ్య పిడుగుపాటుతో చాలా ఏళ్ల కిందట మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి దాలమ్మ కూలి పనులు చేసుకుని ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసింది. ఒక్కగానొక్క కొడుక్కి ఆగస్టు 13న వివాహం చేయడానికి నిశ్చయించారు. కానీ విధి వక్రీకరించడంతో ఆ కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది.
రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
ఆగస్టులో పెళ్లి ముహూర్తం
అక్కవరంలో విషాదఛాయలు