
పీఎం–ఉషా నిధులతో మౌలిక వసతులు
ఎచ్చెర్ల: ప్రధాన మంత్రి ఉచ్ఛతర శిక్ష అభియాన్ (పీఎం–ఉషా) నిధులను పూర్తి స్థాయిలో ఉన్నత విద్యాభివృద్ధికి, మౌలిక వసతులు కల్పనకు వినియోగించాలని న్యూఢిల్లీకి చెందిన సంబంధిత అధికారి ఎస్.కె భర్నహాల్ సూచించారు. పీఎం ఉషా పథకానికి ఎంపికై న యూనివర్శిటీల వైస్ చాన్సలర్లు, అధికారులతో శుక్రవారం వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. బోధన, పరిశోధన, నూతన నిర్మాణాలు, లేబొరేటరీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, క్రీడా మైదానాలు ఏర్పాటు వంటివాటికి ప్రాధాన్యమివ్వాలన్నారు. నిర్దేశిత సమయంలో నిధులు సద్వినియోగం చేసుకోకపోతే తదుపరి విడత నిధులు విడుదల కావన్నారు. వైస్ చాన్సలర్ కె.ఆర్ రజినీ మాట్లాడుతూ రెండో విడతలో పీఎం ఉషాకు అర్హత సాధించిన దేశంలోని 12 వర్శిటీల్లో అంబేడ్కర్ యూనివర్సిటీ ఒకటని పేర్కొన్నారు. నిధులు వినియోగానికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. సమావేశంలో రెక్టార్ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్ పి.సుజాత తదితరులు పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి గేట్లో 241వ ర్యాంక్
ఎచ్చెర్ల: ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ సీఎస్ఈ విద్యార్థిని కొమరాల శ్వేతశ్రీ గేట్లో 241వ ర్యాంకు సాధించడం అభినందనీయమని డైరెక్టర్ బాలాజీ అన్నారు. ఈ మేరకు విద్యార్థిని శుక్రవారం అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కుమార్తె మంచి ర్యాంకు సాధించడంపై పల్నాడు జిల్లా దుగ్గి గ్రామానికి చెందిన శ్వేతశ్రీ తల్లిదండ్రులు ఆదినారాయణ, అరుణ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పరిపాలన అధికారి ముని రామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, వెల్ఫేర్ అధికారి గేదెల రవి, మోహన్కృష్ణ చౌదరి, ఇన్చార్జి సాగర్, అధ్యాపకులు కోడా దిలీప్కుమార్, నూకేశ్వరరావు, గణేష్ మళ్లా, తేజకిరణ్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు
ఉపకరణాల పంపిణీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత కింద నిర్వహించిన 802 మంది దివ్యాంగులకు రూ.3.20 కోట్ల విలువైన 1230 పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అలీంకో సంస్థ సహకారంతో జనవరిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ భవిష్యత్తులో 40 నుంచి 60 శాతం ఉన్న దివ్యాంగులకు కూడా బ్యాటరీ సైకిళ్లు అందజేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఉపకరణాల కోసం సుమారు 1500 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నా 802 మందికే పంపిణీ చేయడంతో మిగిలిన వారు నిరాశ చెందారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, నరసన్నపేట ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, పౌర విమానయాన సంస్థ చైర్మన్ విపిన్కుమార్, హెచ్ఆర్ మెంబర్ హెచ్.శ్రీనివాస్, జనరల్ మేనేజర్ సంజయ్ సింగ్, ఇండియా ట్రస్ట్ పింక్ సంస్థ ఫౌండర్ ఆనంద్కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, డీసీసీబీ చైర్మన్ ఎస్.సూర్యం, వంశధార చైర్మన్ అరవింద్, రిటైర్డ్ ఆర్డీఓ పీఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు.

పీఎం–ఉషా నిధులతో మౌలిక వసతులు

పీఎం–ఉషా నిధులతో మౌలిక వసతులు