
‘వార్డు సభ్యులకు తెలుపకుండా పనులేంటి..?’
టెక్కలి: మేజర్ పంచాయతీలో వార్డు సభ్యుల ప్రమేయం లేకుండా అధికార పార్టీ కార్యకర్తలు గుర్తించిన పనులకు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదం తెలియజేసేది లేదని పంచాయతీ వార్డు సభ్యు లు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో సాధారణ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పంచాయతీలో ఇటీవల గుర్తించిన కొన్ని రకాల పనులపై ఈఓ వెంకటరావు ప్రస్తావించగా, సభ్యులంతా వ్యతిరేకించారు. పంచాయతీ పరిధిలో వార్డు సభ్యులకు తెలియకుండా ఇష్టానుసారంగా అధిక మొత్తంలో ప్రతిపాదనలు చేసి పనులు గుర్తించారని మండిపడ్డారు. చేసిన ప్రతిపాదనలపై విచారణ చేయాలని పలువురు వార్డు సభ్యులు పట్టుబట్టారు. తమ ప్రమేయం లేకుండా గుర్తించిన పనులకు తామెలా ఆమో దం తెలియజేస్తామని ప్రశ్నించారు. దీంతో సమావేశం పూర్తి స్థాయిలో కొనసాగలేదు. సమావేశంలో సర్పంచ్ జి.సుజాత, వైస్ సర్పంచ్ జి.విశ్వశాంతిరెడ్డితో పాటు పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
‘గిరిజన పాఠశాలలకు
సౌకర్యాలు కల్పించాలి’
పలాస: పలాస నియోజకవర్గంలోని పలాస, మందస ప్రాంతంలోని గిరిజన పాఠశాలలకు తగిన సౌకర్యాలు కల్పించాలని గిరిజన సంక్షే మ సంఘం నాయకులు కోరుతున్నారు. వారు ఈ మేరకు గురువారం వివిధ పాఠశాలలను పరిశీలించారు. చాలా పాఠశాలల్లో తగిన సదుపాయాలు లేవని, పాఠశాలలు కూడా విద్యార్థులకు అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. కిల్లోయి బాలుర పాఠశాలను బాలికల పాఠశాలగా మార్పు చేశారని బాలికలు ఆ పాఠశాలలో చేరడానికి పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. చాలా మంది బాలికలు పెద్దమడికి వెళ్లిపోతున్నారని, వారిని ఇక్కడకు రప్పించే బాధ్యత సంబంధిత అధికారులు తీసుకోవాల ని కోరారు. కిల్లోయి పాఠశాల ఉపాధ్యాయులు గ్రామాల్లో తిరిగి తగిన ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నాయకులు ఎస్.నారాయణరావు, ఎస్.నరిసింహులు, ఎస్.లక్ష్మణరావు, కె.రమేష్ పాల్గొన్నారు.
‘రెవెన్యూ సమస్యలపై సత్వరం స్పందించాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ సమస్యలపై సత్వరమే స్పందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలసి గురువారం శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్కు సంబంధించి తహసీల్దార్లు, హెచ్డీటీ లు, మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి మంగళవారం తహసీల్దార్లు, వీఆర్ఓలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. వారానికో మండలంతో సమావేశం నిర్వహించాలని డీఆర్ఓను ఆదేశించారు. ఈహెచ్ఎస్ ఆస్పత్రి నిర్మించేందుకు స్థలం కో సం ప్రతిపాదనలు పంపాలని సైనిక సంక్షేమ అధికారిని ఆదేశించారు. గార మండలంలో డీసీసీబీ, జలుమూరు మండలంలో వైద్య ఆరోగ్య శాఖ, గార మండలంలో డీఆర్డీఏ, ఎచ్చెర్లలో ఆర్టీఓ, సరుబుజ్జిలి, రణస్థలం మండలాల్లో అంగన్వాడీ కేంద్రాలు, శ్రీకాకుళంలో మార్క్ ఫెడ్, పర్యాటక శాఖకు సంబంధించి భూ సమస్యలపై చర్చించారు. ఇళ్ల స్థలాలపై రీ వెరిఫికేషన్ గతంలో జరిగిందని, దీనిపై సంబంధిత తహసీల్దార్ వీఆర్ఓను తీసుకొని స్వయంగా స్థల పరిశీలన చేసి అక్కడ నిర్మా ణాలు ప్రారంభించారా లేదా చూడాలన్నారు.
కర్మయోగి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. గ్రామ సభ, గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ రెవెన్యూ సమస్యలు తగ్గడం లేదన్నారు. సివిల్ సమస్యలపై తలదూర్చరాదని జేసీ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సాయి ప్రత్యూష, డిప్యూటీ కలెక్టర్లు జి. జయదేవి, డి.పద్మావతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

‘వార్డు సభ్యులకు తెలుపకుండా పనులేంటి..?’