
అసమగ్ర ప్రాజెక్టు!
● అస్తవ్యస్తంగా సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు ● సెక్టోరియల్ అధికారులు లేకుండానే నిర్వహణ ● భర్తీకి నోచుకోని సీఎంవో, జీసీడీవో, కో– ఆర్డినేటర్ పోస్టులు ● మినిస్టీరియల్ సిబ్బందితోనే కొనసాగిస్తున్న వైనం ● విద్యార్థులపై తీవ్ర ప్రభావం
జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయం
శ్రీకాకుళం:
జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు.. సెక్టోరియల్ అధికారులు లేకుండానే నడుస్తోంది. కొన్ని నెలలుగా కీలక పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం, మినిస్టీరియల్ సిబ్బందితోనే అన్ని విభాగాలను నిర్వహిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. 25 కేజీబీవీలను పర్యవేక్షించి అందులోని 2700 బాలికల బాగోగులను చూడాల్సిన జీసీడీవో పోస్టు మూడు నెలలుగా ఖాళీగా ఉంది. కేజీబీవీలోని ఆహార బిల్లులు, ఇతర ఖర్చులతో పాటు విద్యార్థినుల సంరక్షణ బాధ్యతలు చూడాల్సింది జీసీడీవోఏ. నెలకు కోటి రుపాయలపైనే జీతభ త్యాలు, ఆహార బిల్లులు ఇతర ఖర్చులకు సంబంధించి లావాదేవీలు జీసీడీవో ద్వారా జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఆ బాధ్యతలన్నీ సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగి ద్వారా నిర్వహిస్తుండటంపై ఆక్షేపణలు వినిపిస్తున్నాయి.
జాప్యమెందుకో?
వాస్తవానికి రెండు కంటే ఎక్కువ సెక్టోరియల్ పోస్టులు ఖాళీగా ఉంటే తక్షణం నోటిఫికేషన్ ఇచ్చి శాసీ్త్రయ విధానంలో నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్, ఎంఐఎస్ ప్లానింగ్ కో ఆర్డినేటర్ తమ సర్వీసును పూర్తి చేసుకోని రిలీవ్ అయ్యి పాఠశాలలకు వెళ్లిపోగా ఇప్పటీకీ ఆ పోస్టులను భర్తీ చేయలేదు. కమ్యూనిటీ మొబలైజేషన్ ఆఫీసర్, ప్రత్యామ్నాయ పాఠశాలల కో ఆర్డినేటర్ పోస్టులు మూడేళ్లు ఫారిన్ సర్వీస్తో నియామకం పొందినప్పటికీ గడువు తీరకముందే రీ ప్యాట్రేషన్ చేసి వేరొకరిని నియమించడం గమనార్హం. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. సీఎంవోగా పనిచేసిన అధికారి ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి పొంది వెళ్లి పోగా ఆ పోస్టును ఇప్పటికీ భర్తీ చేయలేదు.
ఎక్కడి పనులు అక్కడే..
– పాఠశాలలు పునఃప్రారంభమై రెండు వారాలు కావస్తున్నా జిల్లాలోని కొన్ని మండలాలకు కిట్లు పంపిణీ జరగలేదు. మండల స్థాయికి బూట్లు, యూనిఫామ్ చేరకపోవడమే ఇందుకు కారణం. కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ దీనిని పర్యవేక్షించాల్సి ఉండగా ఆ పోస్టు ఖాళీగా ఉండటంతో పట్టించుకునే వారే కరువయ్యారు.
– ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ప్రారంభ తరగతుల్లో 20 శాతం సీట్లు పేదలకు కేటాయించాల్సి ఉండగా ఆ పని ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనిని పర్యవేక్షించాల్సిన పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో మొత్తం సీట్లు ఎన్ని, పేదలకు ఎన్ని సీట్లు ఇచ్చారన్న సమాచారం నేటికీ సేకరించలేకపోయారు.
– ప్రధానోపాధ్యాయులు సెక్టోరియల్ అధికారులుగా ఉండకూడదని 2024లో విద్యాశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు శ్రీకాకుళం ఎస్ఎస్ఏలో అమలుకావడం లేదు. ముగ్గురు ఉద్యోగులు సుదీర్ఘ కాలం నుంచి ఫారిన్ సర్వీసెస్పై ఇదే శాఖలో కొనసాగుతున్నారు. దీనివల్ల ఆ పోస్టులు కోసం చూస్తున్న ఆశావహులు నిరాశకు గురవుతున్నారు. ఇలా ఎస్ఎస్ఏ పనితీరు ఉండటం వల్లే రాష్ట్రస్థాయిలో జిల్లా స్థానకం 26కు చేరుకుంది. ఇప్పటికై నా ప్రాజెక్టు కో ఆర్డినేటర్గా వ్యవహరించే జిల్లా విద్యాశాఖాధికారి, ప్రాజెక్టు చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించకుంటే ఎస్ఎస్ఏ శాఖ పరిధిలోని విద్యార్థులకు తీరని నష్టం తప్పదు.
నిబంధనలకు తిలోదకాలు
ఎస్ఎస్ఏ ప్రాజెక్టు పనితీ రు అస్తవ్యస్తంగా మారింది. రాజకీయ నాయకులు పేరు చెప్పి కొందరు ఉద్యోగులు పబ్బం గడుపుకుంటున్నారు. సెక్టోరియల్ పోస్టులను మినిస్టీరియ ల్ సిబ్బందితో నిర్వహింపజేస్తూ ప్రాజెక్టును ఎలా నడిపిస్తున్నారో ఏపీసీకే తెలియాలి. పీఎం జన్మాన్ పాఠశాలల పురోగతి నత్తనడకన సాగుతోంది. ఐదు కీలక పోస్టులు ఖాళీగా ఉంటే నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ఆక్షేపణీయం.
– ఎస్.వి.రమణమూర్తి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు
కీలక పోస్టులన్నీ ఖాళీయే..
సమగ్ర శిక్షలో జీసీడీవో, సీఎంవో, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఎంఎస్ కో ఆర్డినేటర్ పోస్టులు కీలకమైనవి. వీటి ద్వారానే విద్యార్థుల స్థితిగతులు, బాగోగులు పర్యవేక్షిస్తుంటారు. ఇలాంటి కీలకమైన పోస్టులు నెలల తరబడి భర్తీ చేయకపోవడం విచారకరం.
– గొంటి గిరిధర్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి

అసమగ్ర ప్రాజెక్టు!

అసమగ్ర ప్రాజెక్టు!