
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 9న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, పాఠశాల స్వీపర్లు పాల్గొంటారని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్, పాఠశాల, కళాశాలల స్వీపర్స్ యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయం సూపరింటెండెంట్ వెంకటేశ్వర పట్నాయక్కు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఉత్తర, కె.సుశీల, నగర కార్యదర్శి టి.ప్రవీణ సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలని, మెనూ చార్జీలు పెంచాలని, ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎ.ఈశ్వరమ్మ, ఎ.మాలతి, చాందిని, ఎ.సుధారాణి పాల్గొన్నారు.