
వారం వ్యవధిలో..అక్కాచెల్లెళ్లు మృత్యువాత
మందస: వారం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలోని అక్కాచెల్లెళ్లు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. మందస మండలం తాళ్లగురంటి గ్రామానికి చెందిన తిలోచన్ జన్ని, బోగి జన్ని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నిఖిత(9) నాలుగో తరగతి కాగా, చిన్న కుమార్తె హారిక(7) రెండో తరగతి. ఇద్దరూ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే చదువుతున్నారు. నిఖితకు గత మంగళవారం(జూన్ 17) వేకువజామున 3 గంటల సమయంలో కడుపు నొప్పి రావడంతో తండ్రి సిరప్ తాగించాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఉదయాన్నే మృతిచెందింది. సరిగ్గా వారం తర్వాత రెండో కుమార్తె హారిక కూడా మంగళవారం(ఈ నెల 24) వేకువజామున మూడు గంటల ప్రాంతంలో కడుపునొప్పితో బాధపడింది. ఈ పాపకు తండ్రి సిరప్ తాగించడంతో ఉదయాన్నే మృతిచెందింది. మరోవైపు, బాలికల చిన్నాన్న శంకర్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. వింతగా ప్రవరిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
ఆందోళనలో గ్రామస్తులు
వారం వ్యవధిలో ఇద్దరు మృతిచెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో మరికొందరు కూడా జ్వర లక్షణాలతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. అయినా ఇంతవరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా వైద్యులు స్పందించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై సిరిపురం పీహెచ్సీ వైద్యాధికారి సాయి వద్ద ప్రస్తావించగా.. మృతులకు జ్వర లక్షణాలు లేనట్లు గుర్తించామన్నారు. గుండెనొప్పితో చనిపోయి ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు.
కడుపునొప్పి లక్షణాలతో బాధపడ్డారని చెబుతున్న కుటుంబ సభ్యులు
గుండెనొప్పి కావచ్చంటున్న వైద్యులు
తాళ్లగురంటిలో విషాదఛాయలు
కానరాని వైద్య శిబిరాలు