పులిజూదం | - | Sakshi
Sakshi News home page

పులిజూదం

Jun 26 2025 6:25 AM | Updated on Jun 26 2025 6:25 AM

పులిజూదం

పులిజూదం

టీడీపీలో అంతర్గత కుట్రలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

జూదం ఆడటం తప్పు. పేకాట శిబిరాలు నిర్వహించడం అంతకుమించి తప్పు. శ్రీకాకుళంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. స్వయంగా కూటమి నాయకులే నిర్వహిస్తున్న ఈ శిబిరాల్లో పెద్ద పెద్ద వ్యక్తులు జూదమాడుతున్నారు. ఇప్పుడీ బలహీనతలే కొంతమందిని రోడ్డుపైకి తీసుకొస్తున్నాయి. దానివెనక రాజకీయ కుట్రలు ఉంటున్నాయి. ఎవరినైతే పదవుల విషయంలో ఎలిమినేట్‌ చేయాలనుకుని భావిస్తున్నారో వారిని వ్యూహాత్మకంగా బుక్‌ చేస్తున్నారు. ఆ మధ్య ప్రముఖ వైద్యుడు దానేటి శ్రీధర్‌ను, తాజాగా పాండ్రంకి శంకర్‌ బ్రదర్స్‌ను అదే రకంగా దెబ్బకొట్టారని కూటమి నాయకుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

దానేటి శ్రీధర్‌ను రచ్చకీడ్చేలా..

ఆ మధ్య కుశాలపురం సమీపంలో దానేటి శ్రీధర్‌ గెస్ట్‌ హౌస్‌లో పేకాట జరుగుతున్నట్టుగా పోలీసులకు సమాచారం వెళ్లింది. స్పెషల్‌ బ్రాంచ్‌, ఎచ్చెర్ల పోలీసులు ఓ రాత్రి దాడి చేసి, ఆరుగురు వ్యక్తుల్ని పట్టుకున్నారు. అప్పట్లో దొరికిన వారిలో దానేటి శ్రీధర్‌ కూడా ఉన్నట్టు బయట ప్రచారం జరిగింది. పోలీసుల దాడులు, పట్టుకున్న విషయమంతా బయటికి వచ్చేలా తెరవెనక కొందరు కథ నడిపించారు. ఆ తర్వాత అదే కూటమి పెద్దల పలుకుబడితో దానేటి శ్రీధర్‌ను సేఫ్‌ చేసినట్టు రక్తికట్టించారు. ఆయన గెస్ట్‌హౌస్‌లో పేకాట జరిగిందని.. శ్రీధర్‌ లేరని క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికి దానేటి శ్రీధర్‌ పరువు అధికారికంగా పోలేదు. ఎందుకిలా చేశారంటే జనసేన నాయకుడిగా డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ రాజకీయంగా పోటీ పడుతున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో భవిష్యత్‌లో పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ముద్ర వేసి వీధిన పెట్టేస్తే.. పదవుల విషయంలో పోటీ ఉండటానికి అవకాశం ఉండదని కూటమిలోనే ప్రత్యర్థులే కుట్ర పూరితంగా వ్యవహరించారన్న వాదనలు నడిచాయి. పథకం ప్రకారం పట్టుకునేలా చేసి.. దొరికాక పట్టుబడ్డ వారి పేర్లలో డాక్టర్‌ పేరు తప్పించేందుకు శరణు కోరేలా చేశారనే ప్రచారం జరిగింది. అనుకున్నట్టే.. ఎన్నికల ముందు హడావుడిగా కన్పించిన దానేటి శ్రీధర్‌ తర్వాత పదవుల విషయంలో పోటీపడ్డ పరిస్థితులు కన్పించలేదు. అందుకు తగ్గట్టుగానే ఆయనకు ఏ పదవీ రాలేదు.

తాజాగా పాండ్రంకి శంకర్‌ బ్రదర్స్‌..

శ్రీకాకుళం నగర టీడీపీలో ప్రముఖ నాయకులుగా పాండ్రంకి శంకర్‌ బ్రదర్స్‌ ఉన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్ష పదవిని శంకర్‌ ఆశిస్తున్నారు. దాదాపు వారికే ఖరారు అవుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సమయంలో ఆ పార్టీలో వారే టార్గెట్‌ చేసి దెబ్బకొట్టారన్న ప్రచారం నడుస్తోంది. ఆయనకున్న పేకాట బలహీనతపై గురి పెట్టి అదను చూసి కొట్టారు. జిల్లా కేంద్రంలోని టౌన్‌ హాల్‌ సమీపంలో ఉన్న పాండ్రంకి శంకర్‌ అపార్ట్‌మెంట్‌లో పేకాడుతూ పలువురు పట్టుబడ్డారు. వారిలో పాండ్రంకి శంకర్‌, ఆయన సోదరుడు దేవేంద్రనాయుడు, ఆమదావలస టీడీపీ నాయకుడు పరధామ విజయ్‌రామ్‌తో పాటు మరొకరు ఉన్నారు. పార్టీలోని ప్రత్యర్థులే అక్కడ పేకాట ఆడుతున్న సమాచారమిచ్చి పట్టించారన్న వాదనలు ఉన్నాయి. పేకాటలో దొరికిపోయే వ్యక్తికి పట్టణ అధ్యక్ష పదవి ఇస్తే ఇబ్బందికరమన్న సమీకరణాలు తెచ్చి ఎలిమినేట్‌ చేయడమే అంతర్గత ప్రత్యర్థుల వ్యూహమని తెలుస్తోంది. సోదరుడు దేవేంద్రనాయుడుకు నగరంలోని ఓ దేవాలయం ట్రస్టుబోర్డు చైర్మన్‌ ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో అతన్ని కూడా టార్గెట్‌ చేసినట్టు తెలిసింది.

రేసులో అర డజనుకు పైగా..

అధికారంలో ఉండటంతో నగర అధ్యక్ష పదవి కోసం టీడీపీలో పోటీ ఎక్కువైంది. అధికారిక పదవి కాకపోయినా పార్టీ పదవితో చక్రం తిప్పొచ్చన్న ఉద్దేశంతో అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత నగర పార్టీ అధ్యక్షుడు మాదారాపు వెంకటేష్‌, ఎన్నికల ముందు టీడీపీలో చేరిన అంధవరపు సంతోష్‌, తాజాగా పేకాటలో పట్టుబడ్డ పాండ్రంకి శంకర్‌, కోరాడ హరిగోపాల్‌, ఉంగటి వెంకట రమణ, గిరిజా శంకర్‌, ఇప్పిలి తిరుమలరావు రేసులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మళ్లీ తనకే వస్తుందని మాదారాపు వెంకటేష్‌ ధీమాగా ఉన్నా.. ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే గొండు శంకర్‌తో స్థానిక రెల్లి వీధి దగ్గర ప్రధాన రహదారిలో గొడవ పడ్డారు. ఆ ఘటన గొండు శంకర్‌కు ఘోర అవమానంగానే చెప్పవచ్చు. తర్వాత ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉంటున్నా.. గతాన్ని గుర్తు చేసుకుని వెంకటేష్‌ను పక్కన పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక, పాండ్రంకి శంకర్‌కు ఎమ్మెల్యేతో సత్సంబంధాలు ఉండటంతో దాదాపు ఆయనకే ఖరారు అవుతుందన్న ప్రచారం ఉంది. వరం ఫ్యామిలీ కూడా ప్రస్తుతానికి కార్పొరేషన్‌ ఎన్నికలు లేకపోవడంతో కనీసం పట్టణ అధ్యక్ష పదవి వస్తుందేమో అన్న ఆశతో ఉన్నారు. ఇక, సీనియర్‌ నాయకులుగా ఉన్న కోరాడ హరిగోపాల్‌, ఉంగటి వెంకటరమణ, గిరిజా శంకర్‌, ఇప్పిలి తిరుపతిరావు వంటి తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు.

అదును చూసి..

రేసులో ఉన్న వారికి మంత్రులు, ఎమ్మెల్యే అండ ఎవరికి ఉందో తెలియదు గాని పాండ్రంకి శంకర్‌ను మాత్రం అదును చూసి పేకాట బాగోతంలో పట్టుబడేలా చేశారు. వాస్తవంగా నగరంలో అనేక చోట్ల పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. ఆడుతున్న వారిలో టీడీపీ ప్రముఖులతో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు. గూనపాలెంకు చెందిన ఓ నాయకుడు ఆధ్వర్యంలో, మహిళా కళాశాల రోడ్డులో ఒక అపార్ట్‌మెంట్‌లో ఎన్నికల ముందు టీడీపీలో చేరిన వారి ఆధ్వర్యంలో, మరికొన్నిచోట్ల పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. వారంతా పకడ్బందీగా శిబిరాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement