
కిడ్నీ ఆస్పత్రిలో అసౌకర్యాలపై ఆరా
కాశీబుగ్గ: పలాస కిడ్నీ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలోని వైద్యులు, సిబ్బందిని నియమించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ డిమాండ్ చేశారు. పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆసుపత్రిని బుధవారం వేదిక సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 మంది డాక్టర్లకు గాను 20 మందిని మాత్రమే నియమించడం రోగులకు ఎలా సేవలు అందుతాయని ప్రశ్నించారు. 60 మంది నర్సులకు 58 మంది కాంట్రాక్టు పద్ధతిలోనే ఉన్నారని, శాశ్వత నర్సులను ఎందుకు నియమించడం లేదో ప్రభుత్వం సమాధానమివ్వాలన్నారు. రీసెర్చ్ పూర్తి స్థాయిలో జరగడం లేదన్నారు. రోజు రోజుకు కిడ్నీ రోగుల సంఖ్య, మరణాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరరావు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నాయకులు ధర్మారావు మాస్టారు, అజయ్ కుమార్, రైతు సంఘం అధ్యక్షుడు మోహనరావు, సీఐటీయూ నాయకులు గణపతి, దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో స్పెషల్ బీఈడీ (ఎంఆర్) కోర్సుకు సంబంధించిన మూడో సెమిస్టర్ ఫలితాలను వర్శిటీ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఉదయ్భాస్కర్ బుధవారం విడుదల చేశారు. 33 మంది హాజరుకాగా శతశాతం ఉత్తీర్ణత సాధించారు. దీంతో పాటు బొల్లినేని మెడిస్కిల్స్ సంస్థ, వర్శిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న పీజీ, డిప్లమా మెడికల్ కోర్సుల సెమిస్టర్ ఫలితాలను కూడా విడుదల చేశారు. మాస్టర్ ఆఫ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్లో ఒకటో సెమిస్టర్కు 30, మూడో సెమిస్టర్కు 31 మంది పరీక్షకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. పీజీ డిప్లమో ఇన్ మెడికల్ రికార్డ్స్ అండ్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ కోర్సులో ఒకటో సెమిస్టర్కు 19 మంది హాజరై శతశాతం ఉత్తీర్ణులయ్యారు.