
పోలీసుల విచారణ
ఎల్.ఎన్.పేట: మండలంలోని లక్ష్మీనర్సుపేట గ్రామ వంశధార నదీ తీరంలో కొలువైన బంగారమ్మ తల్లి గుడి వద్ద సరుబుజ్జిలి పోలీసులు బుధవారం విచారణ చేపట్టారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బంగారమ్మ గుడి వద్ద ఉన్న హుండీ పగలగొట్టి అందులో ఉన్న నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సరుబుజ్జిలి ఎస్ఐ బి.హైమవతి సంఘటనా స్థలానికి పోలీసులను పంపించి సమగ్ర వివరాలను సేకరించారు. విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
● భర్త పరిస్థితి విషమం
టెక్కలి: కోటబొమ్మాళి మండలంలోని తర్లిపేట సమీపంలో జాతీయ రహదారి వద్ద బుధవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. తర్లిపేట గ్రామానికి చెందిన బుడత లోకేష్, భార్య రత్నాలమ్మ తదితరులు వేకువజామున తమకు చెందిన ట్రాలీ రిక్షాపై సారికందను శ్రీపురం జంక్షన్లోని కూరగాయల సముదాయం వద్దకు తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా గుర్తు తెలియని వాహనం వచ్చి బలంగా ఢీకొంది. దీంతో ఇరువురు రోడ్డుపై పడిపోగా, సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో రత్నాలమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. లోకేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఘటనపై కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జెమ్స్లో రోబోటిక్ శస్త్ర చికిత్స
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో బుధవారం రోబోటిక్ శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు రోబోటిక్ సర్జన్ డాక్టర్ చీపురపల్లి వసుంధర తెలిపారు. జిల్లాలోని జలుమూరు మండలానికి చెందిన 46 ఏళ్ల మహిళ గర్భాశయ వ్యాధితో గత కొన్నేళ్లుగా బాధపడుతోంది. ఎన్నో మందులు వాడినప్పటికీ తగ్గకపోవడంతో జెమ్స్ ఆస్పత్రిని సంప్రదించింది. ఈమెను పరీక్షించిన వైద్యురాలు రోబోటిక్ సాయంతో విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ లలిత, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్రెడ్డి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమంత్, హెచ్వోడీ డాక్టర్ రేవతి, గైపాకాలజిస్ట్ డాక్టర్ స్నేహలు పాల్గొన్నారు.
కర్ణాటకకు చెందిన
యువకుడు ఆత్మహత్య
రణస్థలం: పైడి భీమవరంలోని ఒక ప్రైవేటు లాడ్జిలో కర్ణాటకకు చెందిన సర్వీస్ ఇంజినీర్ ఎంఆర్ సందీప్(25) ఆత్మహత్యకు పాల్పడినట్లు జేఆర్పురం పోలీసులు తెలిపారు. పైడి భీమవరం డాక్టర్ రెడ్డీస్ పరిశ్రమలో సర్వీసింగ్ చేసేందుకు లోటస్ కంపెనీ నుంచి సర్వీస్ ఇంజినీరుగా సందీప్ ఈనెల 4వ తేదీన వచ్చాడు. విధులు నిర్వహిస్తూ పైడిభీమవరంలో ఒక లాడ్జిలో రూమ్ తీసుకుని ఉంటున్నాడు. మంగళవారం నుంచి లోటస్కు సంబంధించిన తోటి ఉద్యోగులు ఫోన్ చేస్తున్నా తీయడం లేదు. బుధవారం ప్రయత్నించగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. పైడి భీమవరం రెడ్డీస్ ఉద్యోగులకు విషయం చెప్పి లాడ్జికు పంపించారు. రూమ్ లోపల గడియపెట్టి ఉండడంతో లాడ్జి నిర్వాహకుల సాయంతో తలుపు తెరవగా, బాత్ రూమ్లో ఆత్మహత్య చేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుడిది కర్ణాటక రాష్ట్రం దేవన్గిరి సమీపంలోని భాన్వల్లి గ్రామంగా గుర్తించారు. అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎస్.చిరంజీవి తెలిపారు.

పోలీసుల విచారణ

పోలీసుల విచారణ

పోలీసుల విచారణ