
పనులయ్యాయి.. ప్రారంభమెన్నడో..!
ఒకేరోజు ప్రారంభించేందుకేనా..?
రాష్ట్రంలో సుమారు 10 నుంచి 12 చోట్ల ఇదే కార్యాలయ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే శ్రీకాకుళంలోనే ముందుగా నిర్మాణం పూర్తవ్వడం జరిగింది. కానీ మిగతా ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరగకపోవడం కూడా ఇక్కడ భవనం ప్రారంభమవ్వకపోవడానికి ఒక్క కారణంగా తెలుస్తోంది. రాష్ట్ర వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్యాదవ్తో ఒకే రోజు అన్ని భవనాలు ప్రారంభించాలని అనుకోవడం వలనే ఈ భవనం ఆలస్యానికి కారణమని సమాచారం. ఇదే భవనానికి సమీపంలో ఉన్న ఇండోర్ భవనం కూడా రూ.60 కోట్ల వ్యయంతో నిర్మితమై ఉన్నా ప్రారంభానికి నోచుకోకపోవడం కూటమి పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
శ్రీకాకుళం క్రైమ్/శ్రీకాకుళం:
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని రిమ్స్ ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో నిర్మాణం పూర్తయిన జిల్లా ఔషధ నియంత్రణ సహాయ సంచాలకుడి కార్యాలయం నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. 2020లో ఈ భవన నిర్మాణం ప్రారంభించగా, 2024 ఎన్నికలకు ముందే నిర్మాణం పూర్తయ్యింది. కానీ ఏడాది క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం.. పరిపాలనా విభాగం తాత్సారంతో ఇప్పటికీ అద్దె భవనానికి నెలకు రూ.10,497లు చెల్లిస్తున్నారు.
రీ ఎస్టిమేట్ బిల్లులో జాప్యం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.81.60 లక్షలతో మొదట అంచనా వ్యయంగా బిల్లు మంజూరు చేసింది. దీంతో గడిచిన ఎన్నికల ముందే భవనం పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగింది. 2024 జూన్ 3న సంబంధిత శాఖ సహాయ సంచాలకుడు (ఏడీ) చంద్రరావుకు అప్పగించడమూ జరిగింది. అయితే కార్యాలయానికి విద్యుత్ సదుపాయం, చుట్టూ ఫెన్సింగ్ కోసం ముందుగా మంజూరు చేసిన నిధులు సరిపోలేదని అదనంగా రూ.12 లక్షల అంచనా వ్యయం కోసం కూటమి ప్రభుత్వానికి మళ్లీ ఏడీ ప్రతిపాదనలు పంపారు. దీంతో దాదాపు తొమ్మిది నెలల జాప్యం తర్వాత ఈ ఏడాది మార్చి 3వ తేదీన ప్రభుత్వం నుంచి రీఎస్టిమేట్ వ్యయం రూ.10.62 లక్షలు మంజూరైనట్లు ఉత్తర్వులు వచ్చాయి. అయినప్పటికీ నేటికీ విద్యుత్ సదుపాయం, ఫెన్సింగ్ పనులు పూర్తి చేయలేదు.
వైఎస్సార్సీపీ హయాంలో పూర్తయిన జిల్లా ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయం
ఏడాది క్రితమే ఏడీకి అప్పగింత
నేటీకి ప్రారంభమవ్వని వైనం