
విత్తన శుద్ధి.. సాగు వృద్ధి
● ఖరీఫ్కు సిద్ధమవుతున్న రైతులు
● విత్తన శుద్ధిపై అధికారుల
సూచనలు
సూచనలు పాటించాలి
రైతులంతా శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే వ్యవసాయం ఎప్పటికీ లాభదాయకం అవుతుంది. ప్రస్తుతం రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతు భరోసా కేంద్రాల నుంచే అందుతున్నాయి. రైతులు మట్టి పరీక్షలు నిర్వహించి వాటికి అనుగుణంగా ఎరువులు వేసుకుంటే దిగుబడులు సాధించుకోవచ్చును. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – మోహనరావు,
వ్యవసాయాధికారి, ఆమదాలవలస
ఆమదాలవలస:
ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్కు సిద్ధమవుతున్న రైతులు తమ పంట పొలాల్లో జల్లే వరి విత్తనాలకు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రైతులు ఎంపిక చేసుకున్న విత్తనాలకు విత్తన శుద్ధి చేసి పొలాల్లో వెద, నారుమడుల్లో వేస్తే అధిక దిగుబడులు సాధించుకోవచ్చునని చెబుతున్నారు. విత్తన శుద్ధి సాగులో చీడపీడల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1.70 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.
విత్తన శుద్ధి చేసుకోవడం ఇలా...
కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజమ్ లేదా 2.5 గ్రామాల మాంకోజెట్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధిలో తగిన మోతాదులో మందులు వాడాలి. మోతాదు మించితే విత్తనం మొలకశాతం తగ్గుతుంది. శిలింద్ర నాశిని పురుగు మందులతో శుద్ధి చేసిన తర్వాత జీవ రసాయనాలతో మరోసారి శుద్ధి చేయాలి. గింజ పగలకుండా, పైపొర పోకుండా చూసుకోవాలి. చేతులకు గ్లౌజులు, ముఖానికి గుడ్డు కట్టుకోవాలి.
ప్రయోజనాలివే..
విత్తన శుద్ధి నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు, పురుగును సమర్దవంతంగా నివారించడానికి దోహదపడుతుంది. శుద్ధికి వినియోగించే మందులు విత్తనంలోకి చొచ్చుకుపోయి శిలీంద్రాలను నాశనం చేస్తాయి. మొలకెత్తిన లేత మొక్కలు నేలలో ఉన్న శిలీంద్రాలు నుంచి రక్షణ పొందుతాయి. తక్కువ ఖర్చుతో పురుగులు, తెగుళ్లు పంటను ఆశించకుండా చేయవచ్చు.

విత్తన శుద్ధి.. సాగు వృద్ధి