
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ విభాగంలో కిందిస్థాయిలో ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులను అధికారులు, ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, వారి జాబ్చార్టులో లేని పనులు అప్పగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ రకమైన సమస్యలు పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లు సత్యనారాయణ కోరారు. ఈ మేరకు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. వీఆర్ఎలకు నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, పేస్కేలు అమలు చేయాలని విన్నవించారు. నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా నేటికీ తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష వైఖరి ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకుండా మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కనీస వేతనం అమలు చేయాలి
వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.త్రినాథరావు, కె.రమణమూర్తిలు మాట్లాడుతూ పార్ట్ టైం పేరుతో ఫుల్ టైం సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటోందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని, కనీస వేతనం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 సంవత్సరాలుగా నామినీలుగా పనిచేస్తున్న వారితో సేవలను చేయించుకున్నప్పటికీ వీఆర్ఏలుగా గుర్తించకుండా వెట్టి చాకిరి చేయిస్తోందన్నారు. వారిని వెంటనే వీఆర్ఏలుగా గుర్తించాలని, డీఏతో కూడిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్వో, అటెండర్, వాచ్మెన్, డ్రైవర్ మొదలగు ఖాళీల్లో ప్రమోషన్లు 70 శాతం వీఆర్ఏలకు కేటాయించాలని, చట్ట విరుద్ధంగా చేయిస్తున్న నైట్ డ్యూటీలను ఆపాలని కోరారు. కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన సంఘ నాయుకులు, వీఆర్ఏలు కె.అప్పారావు, బి.రాములమ్మ, ఎన్.సీతప్పడు, జి.రామ్మూర్తి, లక్ష్మణరావు, జనార్ధనరావు, బి.అప్పారావు, మీనాక్షి, రాజులమ్మ, పద్మ, ఎం.రాము, లోకనాథం, ఈశ్వరరావు, పోతయ్య, దాలప్పుడు తదితరులు పాల్గొన్నారు.