
సమష్టి కృషితోనే వర్సిటీ అభివృద్ధి
ఎచ్చెర్ల: అందరి సమష్టి కృషితోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అభివృద్ధి జరుగుతోందని వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య కె.ఆర్.రజనీ అన్నారు. వర్సిటీ 18వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ వెనుకబడిన ప్రాంతంలో స్థాపించిన వర్సిటీ ప్రగతిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యమయ్యేలా సంకల్పించుకోవాలన్నారు. వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఎవరూ వ్యవహరించకూడదని సూచించారు. ఇటీవల విడుదలైన పీఎం ఉషా నిధులను వర్సిటీ బలోపేతానికి, మౌలిక వసతులు పెంచేందుకు, నూతన నిర్మాణాలకు వెచ్చించనున్నట్లు తెలిపారు. సిబ్బందికి ఎదైనా సమస్య ఉంటే తనకు నేరుగా తెలియజేయాలన్నారు. డిగ్రీ కళాశాలల అధ్యాపకులు పరీక్షలకు అబ్జర్వర్లను నియమించాలని అంటున్నారని, అయితే ఇన్విజిలేటర్ ఉండగా పరీక్షల్లో చూచిరాతలకు తావు ఉండదని పేర్కొన్నారు. తక్కువ బడ్టెట్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, అబ్జర్వర్లను నియమిస్తే అదనపు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.
వర్సిటీతో పేదలకు ఉన్నత విద్య
వర్సిటీ రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య మాట్లాడుతూ గిరిజన, పేద వర్గాలకు ఉన్నత విద్యనందించడంలో వర్సిటీ ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి.సుజాత మాట్లాడుతూ గత 17 ఏళ్లలో వర్సిటీ సాధించిన విజయాలను వివరించారు. ప్రగతే ధ్యేయంగా పనిచేస్తున్న అధికారులు, వర్సిటీ వర్గాలు పరిపాలనా వ్యవస్థను దిగజార్చే పనులకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే తనకు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ శిష్యుడని, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు వద్ద మంచి పేరు ఉందని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కార్యక్రమంలో వర్సిటీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా.ఎ.ఉదయ్భాస్కర్, డా.ఎం.అనురాధ, డా.సీహెచ్ రాజశేఖరరావు, ఎన్.ఎస్.ఎస్ కో–ఆర్డినేటర్ డా.డి.వినజ, డా.కె.ఉదయ్కిరణ్లు ప్రసంగించారు. ఎస్వో డా.కె.సామ్రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు క్యాంపస్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వీసీ ఆచార్య కేఆర్ రజనీ
ఘనంగా బీఆర్ఏయూ 18వ
వ్యవస్థాపక దినోత్సవం